చిట్టీల పేరుతో రూ. 20 కోట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

by  |
చిట్టీల పేరుతో రూ. 20 కోట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
X

దిశ, కంటోన్మెంట్: చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసిన నిర్వాహకుడు పరారీ అయ్యాడు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మారేడ్‌పల్లిలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన శ్రావణ్ కుమార్.. మారేడ్‌పల్లిలో భావని ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇందుకోసం బంధువులు, స్నేహితులతో పాటు డాక్టర్లు, రిటైర్మెంట్ ఉద్యోగులు, వ్యాపారులకు రూ.కోట్ల రూపాయలు చిట్టీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల పేరిట ఎర వేశాడు. ఇలా 50 మంది నుంచి దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేశాడు.

కొంత కాలం పాటు అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇచ్చిన శ్రావణ్ కుమార్.. ఇటీవల చిట్టీలు, డిపాజిట్ చేసిన సొమ్ము ఇవ్వకుండా ముఖం చాటేశాడు. వారం రోజులుగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో శనివారం బాధితులు మారేడ్‌పల్లిలోని భావని ఎంటర్‌ప్రైజెస్ చీట్‌ ఫండ్‌ వద్దకు చేరుకోగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బోర్డు తిప్పేసి ఉండడమే కాకుండా.. ఆఫీసు ఖాళీగా ఉండడంతో మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పిల్లల వివాహల కోసం డబ్బును కూడబెట్టి చిట్‌ఫండ్‌లో పెడితే నిండా ముంచాడని బాధితులు లబోదిబోమంటున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని పోలీసులకు గోడు వెల్లబోసుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story