భారత్‌లో 5జీ అమలు జాతీయ ప్రాధాన్యతగా మారాలి: ముఖేశ్ అంబానీ!

by  |
భారత్‌లో 5జీ అమలు జాతీయ ప్రాధాన్యతగా మారాలి: ముఖేశ్ అంబానీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ టెక్నాలజీ అమలు జాతీయ ప్రాధాన్యతగా మారాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అన్నారు. బుధవారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 5జీ టెక్నాలజీని దేశ ప్రాధాన్యంగా భావించినప్పుడే డిజిటల్ ఇండియా అనే కల నెరవేరుతుందన్నారు.

అలాగే, దేశంలో వీలైనంత వేగవంతంగా 2జీ నుంచి 4జీ, 5జీ టెక్నాలజీకి మనం మారాలని, సాధారణ పౌరులకు సైతం ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రయోజనాలు అధికంగా లభిస్తాయని, అందుబాటు ధరలో ఉంటేనే దేశీయంగా మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వేగంగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ముఖేశ్ అంబానీ తెలిపారు. జియో ప్రస్తుతం 4జీ, 5జీ అమలు, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాల విస్తరణ దృష్టి సారించింది. తాము 100 శాతం స్వదేశీ 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఇది పూర్తిగా క్లౌడ్ ఆధారితంగా నిర్వహించబడుతుంది. దీనివల్ల జియోలో చాలా సులభంగా 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ అవడానికి వీలుంటుంది.

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీత్ భారతీ మిట్టల్.. దేశీయ టెలికాం పరిశ్రమలో అనేక సవాళ్లు ఉన్నాయని, కొత్త సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో 12 కంపెనీలు ఉండగా, ఇప్పుడు మూడింటికి పడిపోయిందన్నారు. అయితే, గత రెండేళ్లుగా పరిశ్రమ అనేక కష్టాలను ఎదుర్కొందని, ఇదే సమయంలో ప్రభుత్వ సంస్కరణలు కొంత ఊరటనిచ్చాయన్నారు. ఇప్పుడు పరిస్థితులు విశ్వాసం కలిగించే స్థాయిలో ఉన్నాయని, మిగిలిన కంపెనీలు దేశానికి డిజిటల్ వెన్నెముకగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story