రోజాకు నై.. జోగి రమేశ్‌కు జై

by  |
రోజాకు నై.. జోగి రమేశ్‌కు జై
X

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారు కావడంతో మంత్రి పదవులు ఆశించేవారిలో టెన్షన్ మొదలైంది. శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేయడంతో ఆ ఇద్దరి మంత్రి పదవులను ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముందు వరుసలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఇంకొకరు ఎవరు తెరపైకి వస్తారన్నది కీలకంగా మారింది.

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రివర్గ విస్తరణ టైంలో నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి కన్ఫామ్ అనుకున్నారంత. కానీ, అప్పటి పరిస్థితులు, రెడ్డి సామాజిక వర్గం అడ్డురావడంతో కేబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే రోజా అలకబూనినట్లు అనిపించడంతో సీఎం జగన్ ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ పదవి కట్టబెట్టి కూల్ చేశారు. ఈ క్రమంలోనే మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ కేంద్రానికి పంపడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు.. మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని, ఇక రోజాకు మంత్రి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం కాకపోవడంతో మళ్లీ బీసీలకే అవకాశం ఉంటుందని వైసీపీ శ్రేణుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోజాకు చాలావరకు ఆశలు సన్నగిల్లేలా కనపడుతున్నాయి.

మరోవైపు లోకేశ్‌పై గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికల సమయంలో మాటిచ్చారు. అయితే మంగళగిరిలో విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిది.. రెడ్డి సామాజికవర్గం కావడంతో అప్పుడు మంత్రి పదవి కన్ఫామ్ కాలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రివర్స్ కాబోతుందన్న వార్తలు వస్తున్నాయి. మరో సీనియర్ నేత అంబటి రాంబాబు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జగన్ ఆయనవైపు మొగ్గు చూపేలా కనపడటం లేదు. అయితే పెడన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరుగా జరుగుతుంది. బీసీ నేత కావడం, మీడియా దగ్గర మంచి వాక్పటిమతో మాట్లాడుతుండటంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపి మంత్రి పదవి కట్టబెడుతారన్న ప్రచారం జరుగుతోంది.

జోగి రమేశ్‌ పేరు రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రధానంగా వినిపిస్తుండటంతో జగన్ మదిలో నుంచి ఇంకెవరి పేరు బయటకు వస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో పార్టీలో ట్రబుల్ షూటర్ అయిన విజయసాయిరెడ్డి ద్వారా ఆశావహులు లాబీయింగ్ మొదలు పెట్టారు. అటు జగన్‌కు సన్నిహితంగా ఉండే కొడాలి నాని ద్వారా కూడా మనసులో ఉన్న మాటను చెబుతూ ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి పోయారు. అయితే ఇద్దరి మంత్రులు పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో వీరి శాఖలను సీఎం జగన్ ఇతరులకు అప్పగిస్తారా లేకుంటే తన వద్దే ఉంచుకుంటారా అన్నది సైతం చర్చకు వస్తోంది. ఒకటి బీసీకి, మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి అప్పగిస్తారని కూడా ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకొని ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఆస్తక్తికరంగా మారింది.

Tags: Roja, Jogi Ramesh, Minister’s post, Rajya Sabha candidates Pilli Subhash Chandra Bose, Mopidevi Venkata Ramana

Next Story