సిటీ సైలెంట్

by  |
సిటీ సైలెంట్
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రోడ్ల‌పై ట్రాఫిక్ అంతంత మాత్రంగానే క‌న‌బ‌డుతుండ‌గా సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇదేంటి క‌రోనా లాక్ డౌన్ మ‌ళ్లీ విధించా ర‌నుకుంటున్నారా ? అలాంటిదేమీ లేదు . సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు భాగ్య‌న‌ర‌గంలో సెటిలైన వారు త‌మ సొంతూళ్ల‌కు క్యూ కట్టారు.

న‌గ‌రం నుంచి తెలంగాణ ప‌ల్లెల‌కు పోయే వారి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌గా అధిక శాతం ప్ర‌జ‌లు ఏపీలోని సొంతూళ్ల‌కు వెళ్తు న్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఏపీలో కోళ్ల పందాలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కూడా న‌గ‌ర ప్ర‌జ‌లు అధికంగా ఏపీ బాట ప‌డుతున్నారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌ద్దీ ప్రాంతాలైన కూక‌ట్‌ప‌ల్లి, పంజాగుట్ట , అమీర్‌పేట్ , ఎస్ఆర్ న‌గ‌ర్, బేగంపేట్, ఖైర‌తాబాద్ , అబిడ్స్ , కోఠి , దిల్ సుఖ్ న‌గ‌ర్ , కొత్తపేట్ త‌దిత‌ర రోడ్ల‌పై రద్దీత‌గ్గిపోయింది. ఏపీకి వెళ్లే విజ‌య‌వాడ హైవేపై ట్రాఫిక్ గ‌ణగణనీయంగా పెరిగింది.

క‌రోనా కార‌ణంగా పాఠ‌శాల‌లు , క‌ళాశాల‌లు మూసి వేయ‌గా ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు కూడా సెల‌వులు ప్ర‌క‌టించాయి. దీనికి తోడు ప్ర‌భుత్వం కూడా పండుగ సంద‌ర్భంగా సెల‌వు ఇవ్వ‌గా శని, ఆదివారాలు కూడా తోడవ్వడంతో ఐదు రోజులు సెలవులు సంక్రాంతి పండుగకు కలిసి వచ్చాయి. దీంతో ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు. ఎల్ల‌ప్పుడు ట్రాఫిక్ జామ్‌లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్ న‌గ‌ర రోడ్లు రొటీన్‌కు భిన్నంగా నిర్మానుష్యంగా మారాయి. రోడ్ల‌పై అంతంత మాత్రంగానే వాహ‌నాలు తిరుగుతుండ‌డంతో వాయు, శ‌బ్ధ కాలుష్యాలు కూడా త‌గ్గాయి. ఉమ్మ‌డి తెలుగు రా ష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కేంద్ర బిందువుగా ఉన్న భాగ్యనగర్ నుంచి సంక్రాంతికి భారీగా ఏపీకి వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే .

కోడి పందాల‌కు ….
సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఏపీలో నిర్వ‌హించే కోడి పందాల్లో పాల్గొనేందుకు న‌గ‌రం నుంచి చిన్నా, పెద్ద తేడా లేకుండా క్యూ క‌డుతున్నారు. సొంత వాహ‌నాల్లో ప‌దుల సంఖ్య‌లో కోడి పందాల్లో పాల్గొనేందుకు త‌ర‌లి వెళ్తున్నారు. సంక్రాంతి అన‌గానే ప్ర‌తి ఒక్కరికీ ఏపీలో జ‌రిగే కోడి పందాలు గుర్తుకు వస్తాయి. ఇవి అధికంగా తూర్పుగోదావరి ,అమలాపురం, రాజమండ్రి, విజ‌య‌వాడ త‌దిత‌ర ప్రాంతాల్లో నిర్వ‌హిస్తుంటారు. వీటిని చూసేందుకు కొంత మంది న‌గ‌రం నుంచి వెళితే మ‌రికొంత మంది వీటిల్లో పాల్గొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వెళ్లారు.

అధిక చార్జీల వసూలు..
సంక్రాంతి పండుగ‌కు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండ‌డం ప్రైవేట్ వాహ‌న‌ దారుల‌కు వ‌రంగా మారింది.ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో పేద ప్ర‌జ‌ల‌కు ఏమి చేయాలో పాలుపోని ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అడిగినంత ఇచ్చు కుని ప్ర‌యాణం కొన‌సాగించారు.


Next Story

Most Viewed