ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు.. దేశంలోనే మొదటిసారి!

by  |
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు.. దేశంలోనే మొదటిసారి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ను కాల్చివేసినా నష్టమే, కాల్చివేయకున్నా నష్టమే. అలాగని ఉత్పత్తిని ఆపేద్దామా అంటే దానికి అంతే స్థాయిలో ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం తప్ప మరో దారి లేదు. కానీ విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థానికి, రీసైకిల్ చేస్తున్న ప్లాస్టిక్‌కు పొంతన లేకుండా పోతోంది. అందుకే భారీ ఎత్తున ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయగలిగే పనిని ఒక దాన్ని నోయిడా అధికారులు ప్రారంభించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి అర కిలోమీటర్ రోడ్డును ప్లాస్టిక్ వ్యర్థాలతో వేయనున్నారు. దీనికి సంబంధించి గురువారం రోజున పనులు కూడా ప్రారంభమయ్యాయి.

ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు వేసే కాన్సెప్ట్‌ను దేశంలోనే మొదటిసారిగా నోయిడా అమలు చేసింది. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు సమానంగా సెక్టార్ 129 వరకు ఈ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు వేసి విజయం సాధించగలిగితే, సిటీల్లో ఉత్పత్తయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయవచ్చు. తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఆయా గ్రామాలకు రవాణా మెరుగుపడుతుంది. అలాగే వానాకాలంలో రోడ్లు పాడవుతాయన్న ఆందోళన ఉండదు. ఈ 500 మీటర్ల రోడ్డుకు 35 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినట్లు నోయిడా అథారిటీ జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి తెలిపారు. రోడ్డు ఉపయోగం ప్రారంభమయ్యాక ఎలాంటి సమస్య తలెత్తకుండా, పనితీరు సంతృప్తికరంగా ఉంటే, మున్ముందు ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed