ఈ త్రైమాసికంలో ఏకంగా 46 శాతం లాభాల్లో రిలయన్స్..

by  |
ఈ త్రైమాసికంలో ఏకంగా 46 శాతం లాభాల్లో రిలయన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాలను వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ కాలానికి 46 శాతం వృద్ధితో రూ. 15,479 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. కీలక విభాగాలైన రిటైల్, డిజిటల్, ఆయిల్-టూ-కెమికల్ రంగాల మద్దతుతో గణనీయమైన లాభాలను సాధించినట్టు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా సమీక్షించిన త్రైమాసికంలో డిజిటల్ సేవల విభాగం ద్వారా అన్ని వ్యాపారాలు కొవిడ్-19 మహమ్మారి స్థాయి ముందునాటి స్థాయికి చేరుకున్నాయి. ఇక, ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది నమోదైన రూ. 1.16 లక్షల కోట్లతో పోలిస్తే 49.8 శాతం ఎక్కువని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

‘అంతర్జాతీయంగా ఆర్థికవ్యవస్థల బలమైన పునరుద్ధరణతో తమ వ్యాపారాలన్నీ కరోనా పూర్వస్థాయిల వృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని’ ఆర్ఐఎల్ ఛైర్మన్, ఎండీ ముఖేశ్ అంబానీ అన్నారు. అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ అనుబంధ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రూ. 3,728 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 23.5 శాతం అధికం. ఆదాయం 15.2 శాతం పెరిగి రూ. 23,222 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా రిలయన్స్ రిటైల్ విభాగం 74.2 శాతం పెరిగిన లాభాలతో రూ. 1,695 కోట్లుగా నమోదు చేసింది. ఆదాయం 10.50 శాతం పెరిగి రూ. 45,426 కోట్లుగా వెల్లడించింది. ఆయిల్-టూ-కెమికల్స్ విభాగం ఆదాయం 58.1 శాతం పెరిగి రూ. 120,475 కోట్లుగా ప్రకటించింది.


Next Story