అబుదాబి కెమికల్ కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ఒప్పందం

by  |
Reliance Industries
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పశ్చిమాసియాలో అబుదాబి కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ(తాజీజ్)తో కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అబుదాబులోని రువైస్‌లో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడితో జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ఐఎల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

తాజీజ్ ఈడీసీ అండ్ పీవీసీగా పిలవబడే ఈ కొత్త జాయింట్ వెంచర్‌లో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి నిర్వహణ జరుగుతుందని కంపెనీ తెలిపింది. పశ్చిమాసియాలో రిలయన్స్ చేస్తున్న తొలి పెట్టుబడి ఇదేనని, సౌదీ ఆరామ్‌కోతో ఆయిల్-టూ-కెమికల్ వాటా విక్రయ ఒప్పందం వెనక్కి వెళ్లిన నేపథ్యంలో తాజా జాయింట్ వెంచర్ పెట్టుబడి అంశం పరిశ్రమ వర్గాల్లో కీలకంగా మారింది. రిలయన్స్ సంస్థ అధికారుల ప్రకారం.. తాజీజ్ ఈడీసీ అండ్ పీవీసీ ఏర్పాటుకు సంబంధించి ఈక్విటీ నిర్మాణం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

ఈ జాయింట్ వెంచర్ ఆధారంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని సరుకులను ఎగుమతి చేయడంతో పాటు విక్రయాలకు వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. ‘యూఏఈలో ఈ రసాయనాల ఉత్పత్తి 2025 నాటికి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ డిజైన్ దశలో ఉంది. అనంతరం దిగుమతులకు ప్రత్యామ్నాయంగానూ, స్థానిక విలువను సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రసాయనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని’ ఆర్ఐఎల్ వెల్లడించింది.


Next Story