రిలయన్స్ మార్కెట్ క్యాప్ @రూ.12 లక్షల కోట్లు!

by  |
రిలయన్స్ మార్కెట్ క్యాప్ @రూ.12 లక్షల కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం కొత్త రికార్డును అందుకుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటమే దీనికి కారణం. ఆదివారం క్వాల్‌కామ్‌‌ సం‍స్థ జియోలో 0.15 శాతం వాటాను రూ.730 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రిలయన్స్‌ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ కంపెనీ చరిత్రలో నిలిచిపోనుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో రిలయన్స్ కంపెనీ తన మార్కెట్ విలువను రూ.లక్ష కోట్లను పెంచుకోవడం విశేషం. ఏప్రిల్ నెల తొలి నుంచే రిలయన్స్ కంపెనీ షేర్ ధర పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయంగా విలువైన కంపెనీల పెట్టుబడులతో జియోకు కలిసిరావడంతో కంపెనీ షేర్ ధర వేగంగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ షేర్ ధర సోమవారం ఉదయం రూ.1908.50 వద్ద ప్రారంభమై ఇంట్రాడే గరిష్ట ధర రూ.1947ను తాకింది. తర్వాత మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1938 వద్ద స్థిరపడింది. ఈ నెల ప్రారంభంలో మార్కెట్ నిపుణులు రిలయన్స్ షేర్ ధర డిసెంబర్ నాటికి రూ. 2 వేలు చేరుకోవచ్చని అంచనా వేసినప్పటికీ, అది ఇంకా ముందుగానే చేరుకునే అవకాశాలున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి నెల నుంచి కరోనా వైరస్ కారణంగా మార్కెట్లు పతనమైనప్పటికీ అప్పటినుంచి రిలయన్స్ షేర్ ఏకంగా 120 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఇక, బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సమావేశంపై మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Next Story