మధ్యాహ్నానికి తుట్టెలు

by  |
మధ్యాహ్నానికి తుట్టెలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా అర్థాంతరంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల చదువే కాకుండా మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలల్లో నిల్వ ఉంచిన బియ్యం కూడా పురుగుపట్టడంతో తుట్టెలు కట్టాయి. దీంతో క్వింటాళ్ల కొద్ది బియ్యం వృధా కాగా ప్రజాధనం కూడా నాశనం అయింది. మార్చి 23న నుంచి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించగానే పాఠశాలలకు తాళాలు పడ్డాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడంతో స్టూడెంట్స్‌కు అందించేందుకు ఆయా స్కూళ్లకు తరలించిన బియ్యాన్ని సివిల్ సప్లై డిపార్ట్ మెంట్‌కు పంపించి ఉంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేంది. కానీ అనూహ్యంగా లాక్‌డౌన్ అమలు కావడం, కరోనా భయంతోనే జీవనం సాగించడంతో ఎవరూ కూడా మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసిన బియ్యం గురించి పట్టించుకో లేదు. తీరా ఫిబ్రవరి 1నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభించాలని సర్కారు ఆదేశించింది. సోమవారం పాఠశాలలు ప్రారంభం కాగానే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన యంత్రాంగం స్టోర్ రూములకు వెళ్లి పురుగులు పట్టిన బియ్యాన్ని చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

పట్టించుకునే వారేరీ..?

అయితే ప్రభుత్వం ఫిబ్రవరి 1నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష్య బోధన జరగాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరోక్ష పద్ధతిలో విద్యాబోధన చేస్తున్న టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పాఠశాలల ఆవరణలను శుభ్రం చేయించడం, క్లాస్ రూంలను శానిటైజ్ చేయడంతోపాటు, భౌతిక దూరంలో విద్యార్థులు కూర్చొనే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయ్యారు. అయితే విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనం ఏర్పాట్ల గురించి కూడా దృష్టి సారించినట్టయితే తుట్టెలు కట్టిన బియ్యాన్ని కూడా స్టోర్ రూంల నుంచి తరలించే అవకాశం ఉండేది. కానీ తీరా క్లాసులు ప్రారంభమైన రోజునే స్టోర్ రూంలను పట్టించుకోవడంతో కొంత ఇబ్బందులు ఎదరయ్యాయి.

కరీంనగర్ జిల్లాలో 647పాఠశాలలు, 11 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆయాచోట్ల 900 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా, 680 క్వింటాళ్ల బియ్యం ముక్కిపోయి, పురుగులు పట్టాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని స్కూళ్లలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పూర్తిగా తరలించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైస్ కోసం ఇండెంట్లు పెట్టాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సప్లై అధికారులు బియ్యం పంపించే వరకూ తాత్కాలికంగా కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం నిలిపేశారు. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో 1093 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా, 188 క్వింటాళ్ల బియ్యం వండడానికి పనికి రాకుండా పోయాయి. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాల్లోని 529స్కూళ్లలో సుమారు 300క్వింటాళ్ల మేర బియ్యం పురుగుల పాలయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో 13మండలాల్లోని 300 క్వింటాళ్ల మేర బియ్యం అక్కరకు రాకుండా పోయాయి. దీంతో వాటిని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. తమకు కొత్తగా ఆయా పాఠశాలలకు కావాల్సిన బియ్యం పంపించాలని కోరుతూ సివిల్ సప్లై అధికారులకు లేఖలు రాశారు. కొన్ని స్కూళ్లలో అందుబాటులో ఉన్న వనరులతో మధ్యాహ్న భోజనం అందించేందుకు మండల విద్యాధికారులు చొరవ తీసుకున్నారు.



Next Story

Most Viewed