ఆపత్కాలంలోనూ ఆగని దోపిడీ..

by  |

దిశ, మహబూబ్ నగర్ : కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైస్ మిల్లర్ల వద్ద తీస్తున్న తరుగే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అటు అధికారులు, ఇటు రైస్ మిల్లర్లు తరుగు తీయడం వల్ల ప్రతి క్వింటాల్‌కు దాదాపు 5 కిలోల వరకు నష్టపోతున్నట్టు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికొస్తే..

ప్రభుత్వ అంచనా ప్రకారం.. మొత్తం 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం రాగా.. మిగతా వాటిలో వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు వస్తాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 856 కొనుగోళ్ళు కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 715 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 97 వేల మెట్రిక్ టన్నులకు 33 వేలు, నారాయణపేటలో 1 లక్ష 42 వేల మెట్రిక్ టన్నులకు 17,900, జోగుళాంబ గద్వాలలో 1 లక్ష 3 వేల మెట్రిక్ టన్నులకు 6800, వనపర్తిలో 2 లక్షల 43 వేల మెట్రిక్ టన్నులకు 67,375, నాగర్ కర్నూల్ జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులకు 33,300 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేయగలిగారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికే మూడు వారాలు గడిచినా ఆశించిన మేర ధాన్యం కొనుగోళ్లు జరగలేదనే విషయం స్పష్టం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారులు సేకరించిన ధాన్యం విలువ సుమారు రూ.270 కోట్లకు పైనే వుండగా రైతులకు చెల్లించింది మాత్రం రూ.47 కోట్లు మాత్రమే. ధాన్యం సేకరించడం విషయం ఎలా వున్నా రైతులకు డబ్బుల చెల్లింపుల విషయంలోనూ జాప్యం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ధాన్యమంతా ప్రభుత్వానికి అప్పగించి, డబ్బుల కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలని రైతులు గుసగుసలాడుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న మోసాలు కూడా రైతులను అటువైపు వెళ్ళేందుకు కొంత వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అధికారులు, మిల్లర్లు కలిసి ఇలా దోచుకోవడంపై రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.

కనీస సదుపాయాలు కరువు..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు కూడా కరువయ్యాయి. అకాల వర్షం కారణంగా వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. కనీసం టార్ఫాలిన్లు కూడా లేకపోవడంతో వర్షమొవస్తే రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. తాజాగా మంగళవారం కూడా పలు కొనుగోలు కేంద్రాల వద్ద వర్షానికి రైతుల ధాన్యం తడవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags : Grain purchase centres, Mahabubnagar, Officers, Rice millers


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed