ధాన్యం కొనుగోలు కేంద్రంలో దొంగలు పడ్డారు.. పోలీసులకు తెలిసినా..!

by  |
ధాన్యం కొనుగోలు కేంద్రంలో దొంగలు పడ్డారు.. పోలీసులకు తెలిసినా..!
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని పీఎసీఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో దొంగలు పడ్డారు. పలువురు రైతులకు చెందిన వరిధాన్యం కుప్పల నుండి వడ్లు, కొందరి వడ్ల బస్తాలు, రాత్రి పూట వెలుతురు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు, బల్బులు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

ప్రజా ప్రతినిధులు పూజ చేసి ఎంతో ఆర్భాటంగా తూకం వేసిన మొట్ట మొదటి బస్తాను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు బుగ్గారం రైతులు ఆరోపిస్తున్నారు. పలువురు రైతులు తమ పంట పొలాల్లో కోసిన వరి పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఈ క్రమంలోనే కొందరు దొంగలు జోకిన బస్తాలను, రైతుల వడ్ల కుప్పలలోని ధాన్యం, దొంగల పాలయ్యాయి. వడ్ల కుప్పల నుండి వరిధాన్యం దొంగల పాలు అవడం పట్ల పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత జరిగినా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న నిర్వహకులైన, పీఎసీఎస్ అధికారులు గానీ, సిబ్బంది గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పట్ల రైతుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ఫిర్యాదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు తూకంతోనే రైతులు క్వింటాలుకు 4 నుండి 5 కిలోలు నష్టపోతుంటే, మరో వైపు ఈ దొంగల బెడద, ఇంకో వైపు నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లతో తీవ్ర దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు ఉండవని తమకు తెలుసునని, అందుకే తాము కూడా కంప్లెట్ చేయలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని, దొంగలను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed