హుజురాబాద్ ఉపఎన్నిక దేశానికి దారి చూపనుందా?

by  |
Huzurabad1142
X

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలుస్తారో ఎల్లుండికల్లా తేలిపోనుంది. ఈటల రాజేందర్ గెలుస్తారా లేక టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా? ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం కానీ నోటుదే విజయమన్న విషయం మాత్రం రుజువైపోయింది. ఈ ఇద్దరు అభ్యర్థులూ విచ్ఛలవిడిగా ఓట్ల కోసం నోట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టివుండవచ్చు గాక, బీజేపీ సైతం వెనకపడలేదు. ఉన్నంతలో డబ్బులు పంచింది. ఆ నియోజకవర్గం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్‌కు ఓటు వేయడానికి ఒక్కో ఓటరుకు రూ. ఆరు వేల చొప్పున సీల్డ్ కవర్లలో పెట్టి ఇచ్చారు. బీజేపీ వాళ్లు కూడా ఓటుకు రూ. 1500 ఇచ్చారంటున్నారు. ఓటర్లకు కవర్లు ఇచ్చిన బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాన స్రవంతి మీడియా కూడా ఈ తతంగంపై వార్తలు ఇచ్చింది. బీజేపీ డబ్బులు పంచుతోందని టీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే, టీఆరెస్సే ఆ పని చేస్తోందని, దొంగే దొంగా దొంగా.. అంటోందని బీజేపీ ఆరోపిస్తోంది. కమలం, ఈటల బొమ్మలున్న కవర్లలో నోట్లు పంచే వీడియోలు విడుదల కావడం వెనకాల అధికారపార్టీ కుట్ర దాగివుందని తెలిపింది.

కవర్లు పంచడం ఒకెత్తు అయితే, ఆ కవర్లలో రూ. ఆరు వేలు లేవని, కొన్ని నోట్లు స్థానిక నాయకులు కొట్టేశారని ప్రజలు ధర్నాలు చేయడం మరో ఎత్తు. ఊరందరికీ కవర్లు ఇచ్చి తమకు మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని మరికొందరు రోడ్డెక్కడం ఇంకా విచిత్రమైన విషయం. నిజానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ఓటర్లు గత బుధ, గురువారాల్లో సర్పంచుల, స్థానిక టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ఎదుట ధర్నాలు చేశారు. కవర్లు ఇచ్చిన వాళ్లు మాత్రమే టీఆర్ఎస్‌కు ఓటేస్తారని గ్యారంటీ ఏమిటని, తాము బీజేపీకి ఓటు వేస్తామని వాళ్లకు ఏమైనా కల వచ్చిందా.. అంటూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. ధర్నాలు చేసిన వాళ్లలో అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందినవారు ఉండడం గమనార్హం. కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ మాత్రమే కవర్లు పంపిణీ చేయగా, బీజేపీ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఓటర్లు వాపోయారు. బరిలో ఉన్న మూడవ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా డబ్బులు పంచితే బాగుండేదని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు.

ఓటర్లు ఇలా డబ్బులకు తెగబడడానికి కారణమేంటి? ఇరుపార్టీల వద్దా కవర్లు తీసుకున్న వ్యక్తులు చివరికి ఎవరికి ఓటేస్తారు? ఎక్కువ మొత్తం ఇచ్చినవాళ్లకు వేస్తారా? ఇంట్లో ఉన్న ఓట్లలో చెరి సగం వేస్తారా? ఎవరు ఎంత ఇచ్చారనే విషయంతో సంబంధం లేకుండా మామూలుగా తమకు నచ్చిన పార్టీకి లేదా నచ్చిన అభ్యర్థికి వేస్తారా? అన్నది ఇప్పుడు లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం కనుక తెలిస్తే హుజూరాబాద్‌లో రేపు ఎవరు గెలువబోతున్నారో ఇట్టే చెప్పేయవచ్చు.

నోట్లు తీసుకుని ఓట్లేయడం తప్పు కదా.. అని ఆ నియోజకవర్గంలోని కొందరిని పలకరిస్తే వచ్చిన సమాధానాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ పదేళ్లలో తెలంగాణ ఓటర్ల చైతన్యం పదింతలైందని ఒప్పుకోకతప్పదు. పార్టీలతో సంబంధం లేకుండా లీడర్లందరి వద్ద బోలెడు డబ్బులున్నాయని, ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే చాలు.. కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని, ఇక మంత్రుల ఆర్జనకైతే లెక్కే లేదని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపే పెద్దల సంపాదనపైనా ప్రజలకు భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఐటీ అంటూ చంద్రబాబు కోట్లాది రూ.లు కూడబెడితే, జలయజ్నం, భూముల అమ్మకం అంటూ వైఎస్ సైతం లక్షల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారంటున్నారు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించి సీఎం అయిన కేసీఆర్ సైతం కాళేశ్వరం రీడిజైన్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టుల్లో కమీషన్ల ద్వారా బాగానే సంపాదించారని ప్రజల్లో సీరియస్ టాక్ ఉంది. కేసీఆర్ దగ్గరే కాదు.. ఈటల వద్ద కూడా వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని వాళ్లు నమ్ముతున్నారు. సర్పంచులు, జడ్పీటీసీలే ఇన్నోవా కార్లు మెయింటేన్ చేస్తున్న ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల సంపాదన ఎంతుంటుందో అంచనా వేయలేమా? అంటున్నారు. లీడర్లందరూ అడ్డదారిన సంపాదించిన వాళ్లే అయినప్పుడు, వాళ్ల దగ్గరున్న సంపదంతా జనానిదే అయినప్పుడు ‘మా డబ్బులు మాకు ఇస్తుంటే తీసుకుంటే తప్పేంటని’ కూడా ప్రశ్నిస్తున్నారు.

ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడం అలవాటు చేసింది రాజకీయ నాయకులు, వారి పార్టీలే. స్వతంత్ర భారతంలో దేశాన్ని సుమారు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఎమర్జెన్సీ తర్వాత అతుకుల బొంతగా ఏర్పడిన జనతా పార్టీ అధికారం చేపట్టి కేవలం రెండేళ్లలోనే కుప్పకూలిపోయింది. అనేక చీలిక పార్టీలుగా చీలిపోయింది. అప్పటి నుంచి అనగా 1980ల నుంచి జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో అనేక కొత్త పార్టీలు ఆవిర్భవించాయి. కేంద్రంలో ఏకపార్టీ పాలన పోయి నేషనల్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎన్డీయే), యునైటెడ్ పీపుల్స్ అలయెన్స్(యూపీఏ) వంటి ఐక్యసంఘటనల శకం మొదలైంది. రాష్ట్రాల్లో సైతం చాలా చోట్ల కాంగ్రెస్‌ను ఓడించి ప్రాంతీయపార్టీలు పగ్గాలు చేపట్టాయి. చిన్న పార్టీలను లొంగదీసుకుని లేదంటే ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడం సులభమైంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల, ఎంపీల ధర రూ. కోట్లకు చేరింది. రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయి. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే వేలాది కోట్లు ఖర్చు చేయాల్సిన అగత్యమేర్పడింది. అధికారాన్ని నిలుపుకోవాలన్నా, మరోసారి ఎన్నికల్లో గెలవాలన్నా డబ్బుల మూటలు అత్యవసరమయ్యాయి. ఇందులోంచే భారీ అవినీతి, అక్రమాలకు బీజం పడింది. కుంభకోణాలు, కమీషన్లు మామూలయ్యాయి. అధికారం చేతిలో ఉంటే ఎంతైనా సంపాదించగలమన్న ధీమా అధినేతల్లో ఏర్పడింది. ఫలితంగా ఎన్నికల్లో గెలవడానికి ఓటరుకు లంచం ఎర వేయడం ప్రారంభమైంది. అధికారికంగా ప్రకటించే పథకాలు, హామీలకు తోడు ఓటర్లను నేరుగా ప్రలోభపెట్టడానికి పార్టీలు, అభ్యర్థులు తెగబడ్డారు. ముందే చెప్పినట్లు హుజూరాబాద్ ఎన్నికలో ఈ ప్రక్రియ పీక్స్ కు చేరింది.

ఈ నోటుకు ఓటు చైతన్యం ఎటువైపు వెళ్లనుంది? హుజూరాబాద్ దేశానికి దారి చూపనుందా? భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు ఓటర్లకు డబ్బులివ్వక తప్పదా? రాజకీయాల్లో నైతిక విలువలకు కాలం చెల్లిందా? ఇవ్వలేని పార్టీలు పతనమవుతాయా? డబ్బులిచ్చిన వారికే జనం ఓటేస్తారా? లేక నచ్చిన పార్టీకి వేస్తారా? కాలమే నిర్ణయిస్తుంది. ఈటల గెలుస్తారా? లేక కేసీఆర్ గెలుస్తారా? అన్నది మాత్రం మంగళవారం తెలిసిపోతుంది.

-డి. మార్కండేయ

Next Story

Most Viewed