ఆడిటర్ల నియామకంపై సీఐఐ అభ్యంతరం

by  |
ఆడిటర్ల నియామకంపై సీఐఐ అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆడిటర్ల నియామకంపై ఇచ్చిన సర్క్యులర్‌ను సమీక్షించాలని ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ కోరింది. ఇది కంపెనీల చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని, కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారాలకు ఇబ్బందులను కలిగిస్తుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) తెలిపింది. గత నెల ఆర్‌బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆడిటర్ల నియామకాలకు సంబంధించి పలు నిబంధనలను వెల్లడించింది. అంతేకాకుండా ఆడిటర్ల రీ-అపాయింట్‌మెంట్ కోసం కొంత కాలవ్యవధిని సూచించింది.

‘ఈ నిబంధనల వల్ల కంపెనీలకు, వాటాదారులకు, సాధారణ పరిశ్రమలకు గణనీయమైన ఆటంకాలు ఏర్పడుతాయి. ఆడిట్ సంఖ్యలపై నిబంధనలు, రొటేషన్, జాయింట్ ఆడిట్ నిబంధనల విషయంలో కమర్షియల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే రకమైన నిబంధనలు అమలు చేయకూడదు. ఇలాంటి నిబంధనలను మార్చకుండానే ఆర్‌బీఐ తన లక్ష్యాలను చేరుకోవచ్చని’ సీఐఐ వివరించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు కంపెనీల చట్టం-2013 ద్వారా నిబంధనలు కొనసాగించవచ్చు. అంతేకాకుండా, ఇలాంటి మార్పుల వల్ల పాలసీ నిర్ణయాల్లో అస్థిరతకు కారణమవుతుందని సీఐఐ అభిప్రాయపడింది. ఏప్రిల్ 27న ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రకారం.. డిపాజిట్లను స్వీకరించని, రూ. 1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలను ఈ నిబంధనల నుంచి మినహాయిస్తూ, మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు మూడేళ్ల ఆడిట్‌ను పూర్తి చేసి ఉంటే ఆడిటర్లను మార్చాలని తెలిపింది. రూ. 15 వేల కోట్లకు మించిన ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు జాయింట్ ఆడిటర్లను నియమించాలని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed