కర్ఫ్యూ పెట్టినా.. రెవెన్యూ తగ్గలే!

by  |
కర్ఫ్యూ పెట్టినా.. రెవెన్యూ తగ్గలే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : నైట్ కర్ఫ్యూ, కరోనా సెకండ్ వేవ్ సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు అనుగుణంగానే ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మాసంలోనే రూ.9,340 కోట్లను ఆర్జించింది. ఇందులో రాష్ట్ర సొంత ఆదాయ వనరులు రూ.6,746 కోట్లు ఉంటే, కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చింది రూ.2,594 కోట్లు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు నుంచి రుణం రూపంలో మరో రూ.1,502 కోట్లు సమకూర్చుకుంది.15వ ఆర్థిక సంఘం నిధులు (డివొల్యూషన్), జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ పథకాల గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ల ద్వారా రుణాలు తదితరాలన్నీ కలుపుకుని బడ్జెట్‌లో సుమారు రూ.16 వేలు కోట్లు ఒక్కో నెలకు సగటున వస్తుందని అంచనా వేసింది.

గతేడాది కరోనా తొలి వేవ్‌లో లాక్‌డౌన్ కారణంగా దాదాపు 95శాతం ఆదాయం కోల్పోయింది. కానీ ఈసారి మాత్రం సంతృప్తికరంగానే సమకూరింది. కరోనా పస్ట్ వేవ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వీలైనంత గరిష్ట స్థాయిలో పన్ను వసూళ్ళు జరిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మాసంలోనే ఆదాయం ఆశాజనకంగా సమకూరింది. లాక్‌డౌన్ విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు పెరుగుతున్నా, మృతుల సంఖ్య గరిష్టంగా నమోదవుతున్నా, గతడాది రికార్డులను బద్దలవుతున్నా ఆదాయం విషయంలో మాత్రం సక్సెస్ అయింది.

నైట్ కర్ప్యూ పెట్టినా మందుబాబులు ముందుగానే కొనుక్కోడానికి అలవాటు పడడంతో ఆ రూపంలో రాష్ట్రానికి సమకూరే ఆదాయానికి ఎక్కడా దెబ్బ తగల్లేదు. స్టాంపు-రిజిస్ట్రేషన్ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతీ నెలా రాబట్టేలా అంచనా వేసినా రూ. 717 కోట్లు సమకూరాయి. కొన్ని పద్దుల్లో రాష్ట్ర కేంద్రాల పన్నులు కలిసి ఉండడంతో ఆర్థిక శాఖ అధికారులు వాటిని వేర్వేరుగా చూపించారు. రాష్ట్రానికి ఏప్రిల్ నెలలో వచ్చిన ఆదాయం వివరాలు (కోట్ల రూ.లలో) :

వాణిజ్య పన్నులు : 1,921
వ్యాట్ : 845
ఐజీఎస్టీ/ఎస్‌జీఎస్టీ : 2,697
ఎక్సయిజ్ : 1,030
స్టాంపుడ్యూటీ : 573
ట్రాన్స్‌పోర్టు : 337
మైనింగ్ : 128
ఇతర పన్నులు : 36
పన్నేతర ఆదాయం : 25
కేంద్రం వాటా : 823
ఆర్థిక సంఘం ద్వారా : 230
రిజర్వుబ్యాంకు ద్వారా రుణం: 1,502



Next Story