కేసీఆర్‌కు రెవెన్యూ ఎంప్లాయీస్ తీర్మానం

by  |
కేసీఆర్‌కు రెవెన్యూ ఎంప్లాయీస్ తీర్మానం
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రజలకు మేలైన, మెరుగైన, సత్వర సేవలు అందించేందుకు కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ స్వాగతించింది. సీఎం కేసీఆర్ పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ సంఘం తీర్మానించింది. శనివారం 33 జిల్లాలు, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న తరుణంలో ఉద్యోగులకు వారి సర్వీసు నిబంధనలను, ప్రమోషన్లకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని సీఎంను కోరాలని తీర్మానించారు. డిప్యూటీ తహసీల్దార్లను తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించేందుకు వెంటనే శాఖ పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్వహించాలని సూచించారు.

అలాగే తహసీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్ల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా అడహాక్ ప్రక్రియ ద్వారా పదోన్నతులు కల్పించాలని సంఘం తీర్మానించింది. సంఘం తరపున అన్ని అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రాన్ని సోమవారం అందజేయనున్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, పూల్ సింగ్, రాజ్‌కుమార్, కోశాధికారి వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు ఎస్ఎల్బీ శాస్త్రి, కె.రామకృష్ణ, కృష్ణచైతన్య, కార్యదర్శులు బానాల రాంరెడ్డి, నాగమణి, మాధవి, దేశ్య, శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు వెంకట్ రెడ్డి, నిరంజన్, చంద్రశేఖర్, సంతోష్ లాల్, సతీష్, ఫయీం, మునీర్ పాల్గొన్నారు.

సంఘం తీర్మానాలు

* ఎనిమిది నెలలుగా పోస్టింగుల కోసం వెయిటింగులో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలి.
* బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేపట్టాలి.
* నూతన రెవెన్యూ చట్టం ద్వారా అన్ని స్థాయిల ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా వారి ప్రయోజనాలను పరిరక్షించాలి.
* నాలుగేండ్లుగా సీసీఎల్ఏ నియామకం లేక రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సీసీఎల్ఏను నియమించాలి.
* కొంత కాలంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి లేడు. దాంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం చేపట్టాలి.
* 9 నెలలుగా వెహికిల్ హైర్ చార్జెస్ చెల్లించకపోవడం వల్ల తహసీల్దార్లు ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయ నిర్వహణ ఖర్చులు మంజూరు కాకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సంఘం అభిప్రాయపడింది. వెంటనే సరిపడ బడ్జెట్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలి.
* కొత్తగా నియమితులైన ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లకు వారి స్థానికత ఆధారంగా ఉమ్మడి జిల్లాలకు పోస్టింగు ఇవ్వాలి. స్పౌజ్ కేసులను పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టాలి.
* రాష్ట్రంలోని తహసీల్దార్లు, ఉద్యోగులందరూ పెండింగులో ఉన్న భూ సంబంధమైన సమస్యలు ప్రతి గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలి.
* ప్రజల ఆకాంక్ష మేరకు, సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులందరూ నిరంతరం శ్రమించాలని సమావేశం తీర్మానించింది.


Next Story

Most Viewed