ఆయనకే పీసీసీ పీఠం.. రెండ్రోజుల్లో బాధ్యతల స్వీకరణ !

by  |
ఆయనకే పీసీసీ పీఠం.. రెండ్రోజుల్లో బాధ్యతల స్వీకరణ !
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు ఆ స్థానం కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి పీసీసీ రేసులో ముందున్న రేవంత్‌రెడ్డి పేరే ఖరారైందని, రెండ్రోజుల్లో ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేయనుందని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర, జాతీయ పాలిటిక్స్‌పై తనదైన శైలిలో బాణి వినిపించ గల రేవంత్‌రెడ్డే సీఎం కేసీఆర్‌కు సరైన అపోజిషిన్ లీడరని పలుమార్లు రుజువు కావడంతో తుది జాబితాలో ఆయన పేరునే చేర్చారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వివరించండం, కేసీఆర్‌ను మించి ముక్కు సూటితనంతో దూసుకుపోవడం వంటి ప్రత్యేక లక్షణాలు ఆయన ఎంపికకు కారణమనే న్యూస్ ప్రస్తుతం స్టేట్‌ పాలిటిక్స్‌లో చక్కర్లు కొడుతోంది.

2014నుంచి వరుసగా అన్ని ఎలక్షన్స్‌లో ఓడిపోతూ, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ ప్రమాదంలో ఉన్నందున సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని, రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పారని ప్రచారం జరుగుతోంది. సీనియర్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పార్టీకి పునర్ వైభవం తీసుకురావడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీకి సరైన కౌంటర్లు ఇవ్వగల నేత రేవంత్‌రెడ్డే అని భావించి ఫైనల్ డిసిషన్ తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేగాక టీడీపీ నుంచి వచ్చిన క్యాడర్‌తో పాటు కొందరు టీఆర్ఎస్‌ నేతలతో లోలోపల సత్సబంధాలు కలిగి ఉండటం ఆయనకు ప్లస్ కానుంది. అలాంటి వారిని తీసుకొచ్చి కలుపుకొని పోయే అవగాహన ఉండటంతో పాటు, చివరి అంచుల్లో ఉన్న పార్టీని బతికించి 2023ఎన్నికల్లో విజయం దిశగా నడిపేందుకు రేవంతే సమర్థుడని నమ్మి కీలక బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.

ఓవైపు.. రేవంత్‌రెడ్డి పేరునే ఏఐసీసీ ఫైనల్ చేసిందని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటన చేయడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం వేడెక్కింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా పార్టీ పగ్గాలు అప్పజెప్పుతారని ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని తనకు పీసీసీ చీఫ్ ఇస్తే సీనియర్లను కలుపుకొని 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తానని స్పష్టం చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, జిల్లాలో ఇప్పటికే తమ అనుచరులకు సీట్లు ఇప్పించి గెలిపించిన ఘనతను పార్టీకి హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ తనకు పీసీసీ ఇవ్వకుంటే పార్టీ మారే సంకేతాలను సైతం అధిష్ఠానానికి చేరవేశారన్న చర్చ అటు పొలిటికల్ సర్కిళ్లలోనూ జోరందుకుంది.

అయితే ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా కనిపిస్తున్న టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొని పార్టీని ఏ మేరకు సక్సెస్ చేస్తారని అటు హైకమాండ్ సైతం ఆలోచనలో ఉందన్న వార్తలు విశ్లేషకుల నుంచి వినపడుతున్నాయి. వీరిద్దరిని కాదని పార్టీ నమ్ముకొని ఉన్న మరోవ్యక్తి, ఇతర పార్టీలతో సత్సబంధాలు కలిగి నేతకు పీసీసీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముందు వరసలో శ్రీధర్‌బాబుతో పాటు, జీవన్‌రెడ్డి పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. అయితే వీరందరిలో అధిష్ఠానం ఎవరి పేరు ఖరారు చేసి, డేర్ డిసిషన్‌తో ఎవరి పేరును సీల్డ్ కవరులో పంపుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.


Next Story

Most Viewed