అలంపూర్ నుండి రేవంత్ పాదయాత్ర?

by  |
Revanth Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీపీసీసీ చీఫ్‌గా నియామకమైన రేవంత్ రెడ్డి త్వరలోనే సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిలో భాగంగా తర్వలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ అవకతవకలను ఎండగడుతూ, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా పాదయాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తన పాదయాత్రను సొంత జిల్లా, అనాదిగా వెనుకబాటుకు గురైన ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల కోసమైన తెలంగాణ రావాలి, కృష్ణ, తుంగభద్ర నదుల నుండి వాటా దక్కించుకోవాలి, ఆర్‌డీఎస్ ద్వారా వచ్చే మన నీటి వాటాను పూర్తిస్థాయిలో సాధించుకోవాలని పేర్కొంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అలంపూర్ నుండి ఆర్‌డీఎస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ వచ్చిన క్షణమే పాలమూరుకు పూర్తి స్థాయిలో నీటి వాటాను అందిస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్న ఆర్డీఎస్ నుండి జోగులాంబ గద్వాల జిల్లాకు సాగునీరు అందక పోవడం, ఇప్పుడు ఉన్న నీటిని సైతం తరలించేందుకు ఆంధ్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు స్పష్టం అవుతోంది.

జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదాలతో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ పాదయాత్రకు పునుకున్నట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆరంభమయ్యే పాదయాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టుతూ ఆదిలాబాద్ జిల్లాలో ముగిసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం.


Next Story