కాంగ్రెస్‌లో కనిపించని కీలక నేతలు.. జోక్యం చేసుకోరా..?

by  |
Revanth Reddy Vs Komati Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటు నేతల్లోనూ.. అటు క్యాడర్‌లోనూ రెట్టింపు ఉత్సాహాం నిండింది. అందులో భాగంగానే హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద పండుగలా నిర్వహించారు. దీంతో ఎక్కడ చూసినా ఇదే ప్రధాన చర్చ. ఇదంతా పక్కనపెడితే.. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం గాంధీభవన్‌‌కు దూరంగా ఉన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ ఆ వర్గం నేతలు లేకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

వాస్తవానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీపై మొదటినుంచే గంపెడాశలు పెట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి తమకు దక్కుతుందనే ఉద్దేశంతో ఆ వర్గం బలంగా నమ్మింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఊహించని రీతిలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనంటూ శపథం చేశారు. అందుకు తగ్గట్టుగానే బుధవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కన్పించలేదు.

రాజీ ప్రయత్నాలు చేయకపోవడానికి కారణాలేంటి..

వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం రేవంత్ పేరు ప్రకటించిన తర్వాత కొంతమంది నేతలు అలకబూనారు. భట్టి విక్రమార్క సైతం రెండు మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

రేవంత్ నియామకంపైన కనీసం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మల్లు రవిని రంగంలోకి దించి భట్టి విక్రమార్కను బుజ్జగించింది. ఫలితంగా భట్టి విక్రమార్క అలక వీడి రేవంత్ ప్రమాణ స్వీకరానికి సైతం వచ్చారు. అదేకోవలో మరికొంతమంది సీనియర్ నాయకులకు సైతం రాజీ కుదిర్చారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఆ ప్రయత్నాలేవీ జరగకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య రాజీ ప్రయత్నాలు చేసేందుకు ఎవ్వరూ ప్రయత్నించకపోవడానికి గల అసలు కారణాలేంటి అనేదానిపైన ఆసక్తి నెలకొంది.

సీనియర్ నేతల జోక్యమేది..

కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ ఔనన్నా కాదన్నా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. దీనికితోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గానిదే హవా. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ హవా కొనసాగినా.. నల్లగొండ, భువనగిరి జిల్లాలో కోమటిరెడ్డి వర్గానికే ఎక్కువ పట్టు ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దగా చెప్పుకునే జానారెడ్డి ఉండనే ఉన్నారు. అయితే టీపీసీసీ నియామకం విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు కాంగ్రెస్ సీనియర్లు ప్రయత్నాలు నిజంగానే చేయలేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గతంలోనే బీజేపీ గూటికి చేరతానని ప్రకటించడంతో పార్టీని ఇబ్బందుల్లోకి పడేసినట్టు అయింది. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎవ్వరు చెప్పినా వినరనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీనియర్ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం లేదనే గుసగుసలు విన్పిస్తున్నాయి. భవిష్యత్‌ కార్యచరణపై ఇంతకీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Next Story

Most Viewed