మంత్రి కేటీఆర్​ ఓ ముఠా నాయకుడు.. రేవంత్ సంచలన ఆరోపణ

by  |
మంత్రి కేటీఆర్​ ఓ ముఠా నాయకుడు..  రేవంత్ సంచలన ఆరోపణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​ భూములు, కబ్జాలపై మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో ఓ ముఠా నడుస్తుందని, దీనిలో అధికారులు కూడా ఉండటం బాధాకరమని టీపీసీసీ చీఫ్​, ఎంపీ రేవంత్​రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు మూసీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఏడేండ్ల నుంచి మూసీ రక్షణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పేల్లి రాజశేఖర్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలున్నాయని, త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ అని, ఈ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితమని తెలిపారు. అన్ని రకాల ట్యాక్స్‌లు పెంచారని, రూ. 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని ప్రకటించి పట్టించుకోలేదని విమర్శించారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు అంటున్నారని, మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలను నాలాలు, చెరువలు, కబ్జాల ప్రాంతాల్లో పెట్టమని చెప్పామని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని విమర్శించారు.

Next Story

Most Viewed