సొంత రాష్ట్రాలకు వలస కార్మికుల తిరుగు ప్రయాణం

by  |
workers
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో లాక్​డౌన్ ప్రభావం మొదలైంది. ఈ నెల 12 నుంచి పది రోజుల లాక్​డౌన్ ను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఆర్టీసు సర్వీసులు కూడా లేకపోవడంతో కార్మికులంతా కాలి నడకన రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. మహిళలు, పిల్లలను స్టేషన్లకు చేర్చేందుకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తే ఇదే అదనుగా ఇష్టమొచ్చిన రేట్లతో దండుకున్నారు.

రియల్​ ఎస్టేట్​ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర కీలకంగా ఉంది. గతేడాది లాక్​ డౌన్ సమయంలోనూ మన నాయకులు వారిని అభివృద్ధిలో భాగస్వాములంటూ పొగిడారు. అయితే లాక్ డౌన్ కాలంలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. రాత్రి, పగలూ తేడా లేకుండా రైలు పట్టాల వెంబడి వారి ప్రయాణాలు సాగాయి. ఆ ప్రభావం గ్రేటర్ లో నిర్మాణాలు, అభివృద్ధి పనులపై పడుతుందని ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అక్కడక్కడ పని ప్రదేశాల్లోనే భోజన సౌకర్యం కల్పించింది.

Lockdown

అయితే జీహెచ్ఎంసీ, కాంట్రాక్టర్లు, బిల్డర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వలస కార్మికులకు ఆకలి బాధలు తప్పలేదు. దీంతో రాత్రికి రాత్రే చెప్పా పెట్టకుండా తిరిగి వెళ్లిపోయిన కార్మికులు వేళల్లో ఉన్నారు. ఇక్కడే ఉండి ఆకలి బాధలతో చనిపోవడం కంటే సొంత ఊర్లకు చేరుకుంటే చాలని భావించి కార్మికులు వెళ్లిపోయారు. గతంలో మూడు నెలల కాలం అనుభవాలతో మళ్లీ లాక్​డౌన్ అనగానే వలస కార్మికులకు గుండెలు అదురుతున్నాయి. లాక్​డౌన్ విధించిన తొలి రోజే ప్రదేశాల నుంచి వారి ప్రయాణాలు మొదలయ్యాయి. హైటెక్​ సిటీ, శేరిలింగంపల్లి, బాలానగర్​, కూకట్​ పల్లి, పటాన్ చెరు సహా సిటీ నలుమూలలా నుంచి రైల్వే స్టేషన్లకు కార్మికులు బారులు కడుతున్నారు.

workers2

ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్​ ఆపరేటర్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వాళ్లు అధికంగా రేట్లను వసూలు చేస్తున్నారు. కుటుంబాలను వదిలి ఏండ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా ఖర్చయిపోతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ లాక్​డౌన్ లో ఇంటికి చేరుతామో లేదోననే ఆందోళన కూడా వారిలో ఉంది. చాలా మంది కార్మికులు కాలినడకన రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. రెండో సారి లాక్ డౌన్ లోనూ కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ తో పాటు గ్రేటర్​లో చేపడుతున్న ప్రాజెక్టులపైనా ఉండనుంది.



Next Story