స్వగ్రామంలో ముగిసిన లక్ష్మణరావు అంత్యక్రియలు.. హాజరైన ఈటల, ముఖ్య నేతలు

by  |
స్వగ్రామంలో ముగిసిన లక్ష్మణరావు అంత్యక్రియలు.. హాజరైన ఈటల, ముఖ్య నేతలు
X

దిశ, కరీంనగర్ సిటీ : వృత్తి నిబద్ధతకు నిలువుటద్దమై, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ, నిఖార్సయిన వార్తలకు మారుపేరుగా నిలిచి, అందరి నోళ్ళలో నాలుకలా మారి, అనతికాలంలోనే అత్యుత్తమ జర్నలిస్టుగా హుజురాబాద్ డివిజన్‌లో పేరు తెచ్చుకున్న ‘దిశ’ రిపోర్టర్ పోలాటి లక్ష్మణరావు ప్రస్థానం శనివారంతో ముగిసింది. శుక్రవారం విధులు ముగించుకుని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా, జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, శనివారం ఉదయం లక్ష్మణరావు ఆస్పత్రిలో మరణించాడు.

వరంగల్ ఎంజీఎంలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం, అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. స్వగ్రామం ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. నిత్యం అందరితో కలుపుగోలుగా ఉంటూ , వారి సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరించడంలో ముందుండే లక్ష్మణ్ మృతదేహాన్ని చూసి గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

బీజేపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. లక్ష్మణరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన ఇంటికి వెళ్లి లక్ష్మణరావు తల్లి అండాలమ్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం లక్ష్మణరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పట్టణ అధ్యక్షుడు మహేందర్(లడ్డు), బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, తదితరులు మృతదేహాన్ని సందర్శించారు. పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. లక్ష్మణ్ తల్లి అండాలమ్మను ఓదార్చి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మరణించినా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు..

జర్నలిస్టుగా అనేక సమస్యల పరిష్కారంలో ముందుండి, సమాజానికి తన వంతు సాయమందించిన లక్ష్మణ్ రావు, తాను మరణించి కూడా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి, అందరికీ ఆదర్శప్రాయమయ్యాడు. కుమారుడు కానరాని లోకాలకు వెళ్లినా, ఆయన కళ్ళు ఈ లోకాన్ని చూస్తూనే ఉండాలనే భావనతో, ఆయన తల్లి.. లక్ష్మణ్ నేత్రాలు దానం చేయాలని సూచించగా, నేత్రాలు దానం చేశారు.

ప్రమాదంపై కుటుంబ సభ్యుల అనుమానాలు..

రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ లక్ష్మణ్ మరణించడం పట్ల, అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా గ్రామంలో భూ వివాదం కొనసాగుతుండగా, ఇటీవల కొంతమంది లక్ష్మణ్‌పై బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కుటుంబ సభ్యులు చెప్పగా, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, విచారణ జరిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Next Story

Most Viewed