అలాంటి వారి లైసెన్స్ రెన్యూవల్ రద్దు : హైకోర్టు

by  |
అలాంటి వారి లైసెన్స్ రెన్యూవల్ రద్దు : హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆస్పత్రి నిర్వహణకు ఇప్పటికే జారీ అయిన లైసెన్సును రెన్యూవల్ చేసేలా అధికారులను ఆదేశించాలని నగరంలోని విరించి హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను అమలు చేస్తే మాత్రమే లైసెన్సును రెన్యూవల్ చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ముగిసే వరకు తాత్కాలిక పద్ధతిలో రెన్యూవల్ చేయాలని, అయితే అగ్నిమాపక విభాగం పేర్కొన్న అన్ని రకాల ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తేనే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. గడువు ముగుస్తున్నా రెన్యూవల్ చేయడం లేదని హైకోర్టులో విరించి హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

జీహెచ్ఎంసీ, ఫైర్ ఎన్‌వోసీ (నిరభ్యంతర సర్టిఫికెట్) లేనందువల్లనే లైసెన్సును రెన్యూవల్ చేయలేద‌ని వైద్యారోగ్యశాఖ కోర్టుకు వివరించింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నడుస్తున్నందునే లైసెన్స్ రెన్యువ‌ల్ చేయ‌లేద‌ని స్పష్టం చేసింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కరోనా వ్యాప్తి తగ్గే వరకు ప్రైవేటు ఆస్పత్రుల అవసరం చాలా ఉంటుందని, లైసెన్సు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వందలాది మంది రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తుందని, రెన్యూవల్ చేసే వైద్యారోగ్యశాఖ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.

కరోనా మహమ్మారి కొనసాగినంతకాలం తాత్కాలిక ప‌ద్ధతిలో రెన్యువ‌ల్ చేయాల‌ని కొన్ని షరతులతో ఆదేశాలు జారీ చేసింది. అన్నిర‌కాల ఫైర్‌ సేఫ్టీ నిబంధ‌న‌లను పాటిస్తేనే తాత్కాలిక పద్ధతిలో అనుమ‌తి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రిలాక్సేషన్ ఇస్తున్నట్లు వివరించింది. ఇప్పటికిప్పుడు ఆసుపత్రి లైసెన్సును రెన్యూవల్ చేయకుండా ఉంటే దాన్ని మూసేయాల్సి ఉంటుందని, పేషెంట్లను ఇతర ఆస్పత్రుల్లోకి తరలించాల్సి ఉంటుందని, ప్రస్తుతం బెడ్‌లు అందుబాటులోని లేని స‌మ‌యంలో పేషెంట్లను తరలించడం కష్టసాధ్యమని, అందువల్లనే ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను చేయాలంటూ ఆస్పత్రి యాజమాన్యానికి సూచించడంతో పాటు తాత్కాలిక పద్ధతిలో లైసెన్సు రెన్యూవల్ చేయాలంటూ వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.


Next Story

Most Viewed