రఘురామకు వైసీపీ బిగ్ షాక్: ఆ లిస్ట్ నుంచి పేరు తొలగింపు

by  |
రఘురామకు వైసీపీ బిగ్ షాక్: ఆ లిస్ట్ నుంచి పేరు తొలగింపు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరానికొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎంపీ రఘురామ తాను తగ్గేది లేదన్నట్లుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అటు వైసీపీ సైతం తాము తగ్గేది లేదంటుంది. ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పటికే రఘురామను అనర్హుడిగా ప్రకటించాలంటూ లోక్‌సభలో వైసీపీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది మరువకముందే వైసీపీ మరో షాక్ ఇచ్చింది.

వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామ పేరును తొలగించింది. అధికారిక వెబ్‌సైట్‌లో 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీలతోపాటు ఇటీవలే తిరుపతి లోక్‌సభ నుంచి గెలుపొందిన డా.గురుమూర్తి.. రాజ్యసభకు ఎంపికైన వారి పేర్లను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఆ జాబితా నుంచి రఘురామ పేరును తొలగించారు. అంతేకాదు లోక్‌సభలో తమ పార్టీకి 21 మంది సభ్యులే ఉన్నట్లు గుర్తించాలని చీఫ్ విప్ మార్గాని భరత్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ విప్ హోదాలో ఆయన ఈ జాబితాను అందించారని సమాచారం. ఓ బిర్లాకు అందజేసిన ఈ జాబితాలో ఒక్క రఘురామ కృష్ణంరాజు పేరు మినహా మిగిలిన వారందరి వివరాలను పొందుపరిచారని అంటున్నారు. రఘురామను తమ పార్టీ ఎంపీగా గుర్తించట్లేదనే విషయాన్ని భరత్ లిఖితపూర్వకంగా స్పీకర్‌కు తెలియజేసినట్లు సమాచారం. లోక్‌సభలో తమ పార్టీకి 21 మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లు గుర్తించాలని ఆయన లిఖితపూరకంగా కోరారని తెలుస్తోంది.

పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ రఘురామ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ తప్పుబట్టారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఎంపీల జాబితాలో నుంచి తన పేరు తొలగించడంపై ప్రశ్నించారు. పార్టీ నుంచి బహిష్కరించారా అని నిలదీశారు. పొరపాటున తొలగించారా ?లేక కావాలనే తొలగించారా? అని కోరారు. ఒకవేళ పొరపాటున తొలగిస్తే 48 గంటల్లో చేర్చాలని లేని పక్షంలో పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. బహిష్కరించినట్లైతే తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకుంటానని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed