ఎల్‌వీబీ విత్‌డ్రా పరిమితులపై డిపాజిటర్లకు ఊరట

by  |
ఎల్‌వీబీ విత్‌డ్రా పరిమితులపై డిపాజిటర్లకు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్షోభానికి గురైన లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్‌వీబీ)ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌(డీబీఐఎల్)తో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో బ్యాంకు డిపాజిటర్లకు విత్‌డ్రా పరిమితులు తొలగనున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) లక్ష్మీ విలాస్ బ్యాంకును నెల రోజుల పాటు మారటోరియం విధించింది. డిసెంబర్ 30 వరకు డిపాజిటర్లకు విత్‌డ్రాను రూ. 25 వేలకు పరిమితం చేసింది. అత్యవసర వైద్య ఖర్చులకు, విద్యా ఖర్చులకు మాత్రమే రూ. 25 వెలకు మించి విత్‌డ్రాకు అనుమతి ఇచ్చింది.

కాగా, బుధవారం డీబీఐఎల్‌లో విలీనానికి ఆమోదం ఖరారు కావడంతో 20 లక్షల మంది డిపాజిటర్లకు విత్‌డ్రా పరిమితి అంశంలో భారీ ఊరట లభించింది. లక్ష్మీ విలాస్ బ్యాంకుపై మారటోరియం ప్రకటించిన తక్కువ వ్యవధిలో డీబీఎస్ బ్యాంకులో విలీనానికి ఆర్‌బీఐ మొగ్గుచూపింది. ప్రజలు, వాటాదారుల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానించిన తర్వాత ఆర్‌బీఐ ప్రభుత్వ అనుమతి కోసం కోరింది. అయితే, మారటోరియం ముగియక ముందే ప్రభుత్వం ఆమోదం లభించడంతో డిపాజిటర్లకు తొందరగా విత్‌డ్రా పరిమితుల్లో ఊరట దక్కింది.


Next Story

Most Viewed