42.6 కోట్లకు పెరిగిన రిలయన్స్ జియో వినియోగదారులు

by  |
42.6 కోట్లకు పెరిగిన రిలయన్స్ జియో వినియోగదారులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది మార్చి 31 నాటికి 42.6 కోట్లకు పెరిగిందని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా అభివృద్ధి చెందుతున్న కొత్త 5జీ టెక్నాలజీని వేగవంతం చేస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఫేస్‌బుక్, గూగుల్ సహా 13 అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 1.52 లక్షల కోట్ల నిధులను సేకరించినట్టు నివేదికలో వెల్లడించింది. సమీక్షించిన ఏడాదిలో కొత్తగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9 కోట్లు పెరగడంతో 42.6 కోట్లకు వినియోగదారులు పెరిగారు. అలాగే, గతేడాది ముగింపు సమయానికి కంపెనీ స్థూల ఆదాయం రూ.90,287 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వివరించింది.

ఈ ఏడాది మార్చి నాటికి జియో వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) రూ. 138.2 గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వినియోగదారుకు సగటు డేటా వినియోగం 13.3 జీబీగా ఉండగా, గతేడాది మొత్తం డేటా వినియోగం 16.7 బిలియన్ జీబీకి పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం జియో డిజిటల్ ప్లాట్‌ఫామ్ దేశీయంగా 5జీ టెక్నాలజీని వేగవంతం చేస్తోంది. దీనివల్ల అన్ని చోట్లా డేటా అందుబాటులో ఉండనుంది. కాగా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద కేవలం వారం రోజుల్లో ఏకంగా 6.2 బిలియన్ డాలర్లు(రూ. 45.2 వేల కోట్లు) పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్ బుధవారం తెలిపింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 10 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ముఖేష్ అంబానీ సంపద భారీగా పెరిగిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ ప్రకారం.. జూన్ 1 నాటికి ముఖేష్ అంబానీ సంపద మే 23న 77 బిలియన్ డాలర్లు(రూ. 5.62 లక్షల కోట్లు) ఉండగా, 83.2 బిలియన్ డాలర్ల(రూ. 6.07 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఎక్శ్ఛేంజీల వివరాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలో ముఖేష్ అంబానీకి 49.14 శాతం వాటా ఉంది.

Next Story

Most Viewed