రిలయన్స్ నుంచి జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లు

by  |
రిలయన్స్ నుంచి జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లు
X

దిశ, వెబ్‌డెస్క్: జియో ప్లాట్ ఫామ్స్‌ భాగంతో జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్టులను తీసుకురానున్నట్లు రిలయన్స్ కంపెనీ తెలిపింది. 43వ వార్షిక సమావేశంలో భాగంగా సరికొత్త టెక్నాలజీలను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను వివరించారు.

జియో గ్లాస్‌లో రియాలిటీ హెడ్‌సెట్ ఉంటుంది. దీని ద్వారా వర్చువల్ ఇమేజెస్‌ను చూడవచ్చు. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. సింగిల్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంటుంది. దీని ద్వారా మొబైల్‌కు కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే 25 యాప్స్‌ను ఇందులో ఇన్స్టాల్ చేసినట్టు వెల్లడించారు. వీడియో మీటింగ్స్‌కు కూడా ఈ గ్లాసులు అనువుగా ఉండటమే కాకుండా, విద్యార్థులకు కూడా ఈ గ్లాసులు చాలా ఉపకరిస్తాయి. చారిత్రక ప్రదేశాలతో పాటు వివిధ అంశాలను వర్చువల్‌గా చూస్తూ పాఠాలను నేర్చుకోవచ్చు. త్రీడీని కూడా ఈ గ్లాస్ సపోర్ట్ చేస్తుంది.

జియో టీవీ ప్లస్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ తదితర పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇందులో ఉన్నాయి. వాయిస్ సర్చ్ కూడా అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన సరుకులును అందజేయడానికి జియోమార్ట్‌ను తీసుకొస్తున్నట్టు ఈషా అంబానీ తెలిపారు. కస్టమర్లు, కిరాణా షాపులు, ఉత్పత్తిదారులను అనుసంధానం చేయడం..రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను నలుమూలలకు తీసుకెళ్లడం అనే రెండు పిల్లర్ల ఆధారంగా జియో మార్ట్ పని చేస్తుందన్నారు. జియో మార్ట్ ద్వారా తొలి ఆర్డర్ చేసిన వారికి మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు.



Next Story

Most Viewed