కొవిన్‌లో నమోదు తప్పనిసరి

by  |
కొవిన్‌లో నమోదు తప్పనిసరి
X

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి టీకా వేసుకోవడానికి అర్హత పొందుతున్న 18ఏళ్లు పైబడ్డవాళ్లు కొవిన్‌ వెబ్‌సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం స్పష్టం చేసింది. తొలుత నేరుగా టీకా కేంద్రాల్లోనే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ వేయడం సాధ్యపడదని వివరించింది. మే 1వ తేదీ నుంచి టీకా తీసుకోవాలని భావిస్తు్న్నవారు ఈ నెల 28 నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల్లో టీకా వేసుకోవడానికి ముందస్తుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు 45ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ చేస్తున్నది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడినవారందరూ టీకాకు అర్హులుగా కేంద్రం ప్రకటించింది. 45ఏళ్లుపైబడినవారికి ఎప్పటిలాగే ఉచితంగా టీకా పంపిణీ చేస్తానన్న కేంద్రం ప్రభుత్వం 18ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య వయస్కులకు టీకా పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కంపెనీల నుంచి టీకా కొనుగోలు చేసి వారికి టీకా వేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ప్రైవేటు రంగానికి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించింది.

వచ్చే నెల నుంచి టీకా పంపిణీకి సిద్ధపడ్డ కొత్త ప్రైవేటు టీకా కేంద్రాలు కొవిన్‌లో తప్పకుండా ముందస్తుగా నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది. అవి ఏ ధరకు టీకా పంపిణీని చేపడుతున్నాయో? ఏ టీకాలను పంపిణీ చేస్తున్నాయో? సమగ్ర వివరాలు పొందుపరచాలని పేర్కొంది. తద్వారా అర్హులు వారి సౌకర్యానికి అనుగుణంగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం వీలవుతుందని వివరించింది. సదరు ప్రైవేటు టీకా కేంద్రాలూ పంపిణీకి అర్హతను కలిగి ఉన్నాయా? లేవా? అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి అనుమతినివ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

మే 1వ తేదీకి ముందు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన టీకాలను రాష్ట్రాలకు అప్పజెప్పాలని, ఈ నెల 30లోపు ప్రైవేటు టీకా కేంద్రాల్లోని వ్యాక్సిన్లు పూర్తిగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. వచ్చే నెల నుంచి మొదలవనున్న మూడో దశ టీకా పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమాయత్తం కావడానికి అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో పౌరులకు టీకా పంపిణీ చేయనున్నందున ముందు జాగ్రత్తలు, ఎంచుకోవాల్సిన వ్యూహంపై పలు అంశాలను తెలియజేసింది.


Next Story