భారత్‌తో చైనా సరిహద్దు విభేదాలపై కుదిరిన ఏకాభిప్రాయం

by  |
భారత్‌తో చైనా సరిహద్దు విభేదాలపై కుదిరిన ఏకాభిప్రాయం
X

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు విభేదాలు సద్దుమణుగుతున్నాయని చైనా ప్రకటించింది. మిలిటరీ కమాండర్ల స్థాయిలో ఈ నెల 6న జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాలను ఇరుదేశాలూ అమలు చేయడం ప్రారంభించాయని వెల్లడించింది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యంగ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రస్థావించింది. రెండు దేశాలూ దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంబంధిత అంశాలపై అర్ధవంతమైన చర్చలు జరుపుతున్నాయని చున్యంగ్ తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయని వెల్లడించారు. అలాగే, బుధవారం బెటాలియన్ కమాండర్, మేజర్ జనరల్‌ల స్థాయిలలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. చర్చలు ఏకాభిప్రాయంతో సాగుతుండటంతో సైన్యాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయని వెల్లడించింది. కాగా, చర్చల అనంతరం గాల్వాన్ వ్యాలీలోని 14, 15 పెట్రోలింగ్ పాయింట్స్ నుంచి చైనా సైన్యం 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లగా, భారత సైన్యం కూడా కొంతమేర వెనక్కి వచ్చినట్టు ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు చున్యంగ్ నిరాకరించారు.


Next Story