పీజీ ఇన్​సర్వీస్ ​కోటాకు ఓకే..!

by  |
పీజీ ఇన్​సర్వీస్ ​కోటాకు ఓకే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్​ పీజీ సీట్ల కేటాయింపుల్లో మళ్లీ ఇన్​ సర్వీస్ ​కోటా విధానాన్ని​ అందుబాటులోకి తెస్తే, వైద్యవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని నిపుణుల కమిటీ సర్కార్​ కు నివేదించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇన్​ సర్వీస్​ కోటాను ఇక్కడ ప్రారంభిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది అధ్యయనం చేయాలని ప్రభుత్వం గత నెలలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీలో డీఎంఈ డా రమేశ్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌‌, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డా శ్రీనివాసరావులు ఉన్నారు. వీరు ఇన్​సర్వీస్​ కోటా అమలుపై 20 రోజుల పాటు స్డడీ చేసి సర్కార్​ కు రిపోర్టును అందించారు. నాన్ ​క్లినికల్​ విభాగంలోని 40 శాతం, క్లినికల్​లో 20 శాతం సీట్లను కేటాయించాలని కమిటీ సూచించింది. దీని వలన సర్కార్​ దవాఖాన్లలో వైద్యులు పెరగడమే కాకుండా, గ్రామాల్లోనూ వైద్యసేవలు మరింత మెరుగవుతాయని వివరించారు.

స్పెషలిస్టులు ముందుకు వస్తారు

ప్రభుత్వ హాస్పిటళ్లలో గత కొన్నేళ్లుగా టెంపరరీ విధానంలో నియామకాలు జరుగుతున్నందున పనిచేసేందుకు స్పెషాలిటీ డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇన్​ సర్వీస్​ కోటాను అమలు చేస్తే కచ్చితంగా వస్తారని కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పైగా పీజీ సీట్లు తక్కువగా ఉండటం వలన పీజీ సీట్​ కోసం ప్రభుత్వ హాస్పిటల్స్​ లో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు వస్తారని పేర్కొన్నది. ఈ విధానంలో పీజీ పూర్తి చేస్తే 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ హాస్పిటల్స్​ లో పనిచేయాలనేది నిబంధన. దీంతో ప్రభుత్వంలో డాక్టర్లు పెరగడంతో పాటు, అవసరమైన ఏరియాల్లో వారితో పనిచేయించుకోవచ్చని సర్కార్​ భావిస్తున్నది.

క్లినికల్​ కు 20, నాన్​ క్లినికల్​కు 40…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్​ కాలేజీల్లో సుమారు 900 , ప్రైవేట్​ లో మరో 1117 పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లోని సగం సీట్లను నేషనల్ పూల్‌ విధానంలో, మరో సగం సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని సగం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా, మరో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇన్​ సర్వీస్​ కోటా అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లోని స్టేట్ కోటా సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో 20 శాతం క్లినికల్​ కు , మరో 40 శాతం నాన్​ క్లినికల్​ విభాగాలకు కేటాయిస్తారు.

నిబంధనలు ఇలా..

ట్రైబల్ ఏరియాలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండేళ్ల పాటు పనిచేసినోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, అర్బన్​ లో ఆరేళ్లు పాటు వైద్యసేవలు అందించిన వారికి ఇన్​ సర్వీస్​ కోటా రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే వీరు నీట్​ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. దీంతో పాటు ఐదేళ్ల పాటు సర్కార్​ దవాఖాన్లలో పనిచేస్తానని ముందస్తుగానే అంగీకార పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ స్థాయిలో జరిమానా విధించే అవకాశం ఉన్నది.

Next Story

Most Viewed