ఆర్‌బీఐని నిలదీసిన సుప్రీంకోర్టు!

by  |
ఆర్‌బీఐని నిలదీసిన సుప్రీంకోర్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈఎమ్ఐ మారటోరియం వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం కాలానికి బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. ఈ విషయంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మారటోరియం కాలానికి వసూలు చేసే వడ్డీని మాఫీ చేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మారటోరియం కాలానికి రుణాలపై వడ్డీని మాఫీ చేయాలన్న పిటిషనర్ వాదనతో ఆర్‌బీఐ విభేదించింది. బ్యాంకుల ఆర్థిక సాధికారతను పట్టించుకోకుండా వడ్డీ వసూలు చేయకూడదని చెప్పడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం ముందు తెలిపింది. అదే సమయంలో మారటోరియం సమయంలో ఈఎమ్ఐలపై వడ్డీ భారం గురించి జూన్ 12వ లోపు సమాధానం ఇవ్వాలని ఆర్థికమంత్రిత్వ శాఖకు సుప్రీం కోర్టు సూచించింది. మారటోరియం సమయంలో రుణ ఈఎమ్ఐలపై వడ్డీ రద్దు వల్ల బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్‌బీఐ వివరించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మారటోరియం కాలంలో ఈఎమ్ఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చర్చనీయాంశమైన అంశమని, మారటోరియం వెసులుబాటు ఇస్తూనే ఈఎమ్ఐలపై వడ్డీ వసూలు చేస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ సమాధానం ఇవ్వడానికి ముందే మీడియాకు లీక్ కావడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ ముందు మీడియాకు, ఆ తర్వాత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తోందా అని ప్రశ్నించింది.

Next Story