ఇంటి వద్దకే పంపిణీ శుభసూచకం : మంత్రి గంగుల

by  |
ఇంటి వద్దకే పంపిణీ శుభసూచకం : మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ కారణంగా గ్రామాల్లోని పేదలకు నేరుగా ఇంటి వద్దకే ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం శుభసూచకమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శనివారం కరీంనగర్‌లో మున్సిపల్ వర్కర్స్‌కు కిట్స్ పంపిణీ, రేషన్ షాపుల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రేషన్‌ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో రూ.1100 కోట్ల వ్యయంతో 2 కోట్ల 80 లక్షల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. సర్వర్ సమస్య కారణంగా బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరిగినా ఆ సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్రంలో 87 లక్షల తెల్ల రేషన్ కార్డు దారుల్లో ఇప్పటికే 35 శాతం బియ్యం పంపిణీ పూర్తయిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు అర్బన్ ఏరియాల్లో వరుసగా 3సార్లు బియ్యం తీసుకోని వారి బయోమెట్రిక్ తీసుకుంటున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ అవసరం లేకుండానే బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. రేషన్ బియ్యం పంపిణీతో ప్రభుత్వం ఇచ్చే రూ.1500లకు ఎలాంటి సంబంధం లేదని, రేషన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, కావున దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు.

Tags: corona, lockdown, ration distribution to villagers, home delivery, minister gangula


Next Story

Most Viewed