దహన కార్యక్రమాలకు రేట్ ఫిక్స్

by  |
దహన కార్యక్రమాలకు రేట్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో శ్మశాన వాటికల్లో దహన కార్యక్రమాలకు అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. నిర్ణయించిన ఛార్జీలకంటే ఎక్కువ వసూలు చేయకుండా శ్మశాన వాటికల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కొవిడ్ కేసులతో పాటు సాధారణ డెడ్ బాడీలను దహనం చేసేందుకు ఇష్టారీతీలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ శనివారం జీహెచ్ఎంసీ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించారు.

కొవిడ్ పేషంట్లను కట్టెల మీద దహనం చేస్తే రూ.8 వేలు, ఎలక్ట్రిక్ క్రిమేషన్​కోసం రూ.4 వేలు, నాన్ – కొవిడ్ వ్యక్తుల దహన క్రియలకు రూ.6 వేలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. అందరికీ ఈ విషయం తెలిసేలా శ్మశాన వాటికల వద్ద ఈ రేట్ చార్టులతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు. తాను ఆకస్మికంగా శ్మశాన వాటికలను సందర్శిస్తానని, అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు పర్యటనలో తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన జోనల్ కమిషనర్లు శ్మశాన వాటికల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.



Next Story

Most Viewed