టాటా ట్రస్టు నాయకత్వం ఎవరైనా తీసుకోవచ్చు : రతన్ టాటా

by  |
టాటా ట్రస్టు నాయకత్వం ఎవరైనా తీసుకోవచ్చు : రతన్ టాటా
X

దిశ, వెబ్‌డెస్క్ :
దేశీయ వ్యాపార రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రస్టులపై టాటా కుటుంబానికి ప్రత్యేక హక్కులేమీ లేవని, టాటా కుటుంబంతో సంబంధం లేని వారెవరైనా స్వాధీనం చేసుకోవచ్చని, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం తాను ఛైర్మన్‌గా ఉన్నానని, భవిష్యత్తులో ఎవరైనా ఆ స్థానాన్ని కొనసాగించగలరని, దీనికి ఇంటిపేరు టాటా అని ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 1892లో టాటా ట్రస్ట్ ఏర్పడిందని, అప్పటినుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిధులను వినియోగిస్తున్నట్టు రతన్ టాటా సుప్రీంకోర్టుకు విన్నవించారు. టాటా సన్స్ అన్ని టాటా గ్రూపు సంస్థలకు ప్రధాన పెట్టుబడిదారుగా ఉండనుందన్నారు. కాగా, టాటా సన్స్‌లో ట్రస్ట్ 66 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. ఈ వాటాల డివిడెండ్, టాటా ట్రస్టుకు ప్రధాన ఆదాయంగా ఉంది. ఈ కారణంగానే ట్రస్టు చేస్తున్న సంక్షేమ సేవా కార్యక్రమాలకు ఎలాంటి నగదు కొరత ఉండదు. సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా టాటా ట్రస్ట్ ఛైర్మన్ పదవిపై టాటా కుటుంబానికి ప్రత్యేకమైన హక్కులు లేవని రతన్ టాటా తెలిపారు. ఇప్పటికే, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా టాటా ట్రస్టుల నిర్వహణను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు, వివిధ రంగాలకు చెందిన ఉన్నత వ్యక్తుల కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మానవత్వ దృక్పథం ఉన్న వాటికి టాటా ట్రస్టులో ప్రాముఖ్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. దీంతో టాటా సన్స్, ట్రస్టులకు నాయకత్వం వహించే చివరి టాటా కుటుంబానికి చెందిన వ్యక్తిగా రతన్ టాటా నిలవనున్నారు.

టాటా ట్రస్టు దేశంలో అనేక మౌలికమైన మార్పులకు కారణమైంది. జేఎన్ టాటా ఎండోమెంట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, లేడీ మెహర్‌బాయి డి టాటా ట్రస్ట్, సర్ డోరాబ్జీ టాటా ట్రస్ట్, జేఆర్‌డీ అండ్ థెల్మా జే ట్రస్ట్ మొదలైనవి విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సమాజాభివృద్ధి రంగాల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. టాటా ట్రస్ట్ ప్రతినిధి దేవాశిష్ రాయ్ ఈ అంశంపై స్పందిస్తూ సాధారణ పరిస్థితుల్లో ట్రస్ట్ ప్రతి ఏటా రూ. 1,200 కోట్లను స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. టాటా గ్రూప్ స్వాతంత్ర్యం రాకముందే దేశంలో మౌలిక మార్పులను ప్రారంభించింది. 1898లో అత్యాధునిక సైన్స్ విద్యను అందించాలనే లక్ష్యంతో జంషెట్‌జీ టాటా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్లూ ప్రింట్‌ను తయారుచేశారు. దీనికోసం ముంబైలో 14 భవనాలు, 4 భూ ఆస్తులు ఉన్న జంషెట్‌జీ టాటా ఆ సమయంలో తన వ్యక్తి గత ఆస్తిలో సగాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత మైసూర్ రాజు బెంగళూరులో 300 ఎకరాల భూమిని ఇచ్చారు. 1911లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పడింది.

Next Story

Most Viewed