కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స

by  |
కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ప్రాణాపాయంలో ఉన్న ఓ మ‌హిళకు అరుదైన చికిత్స‌ చేసి ఆమె ప్రాణాలను కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు కాపాడారు. హాస్పిట‌ల్‌లోని ప‌లు విభాగాల‌కు చెందిన వైద్య‌నిపుణులు సంయుక్తంగా కృషిచేసి అత్యంత అరుదైన స‌మ‌స్యకు పరిష్కారం చూపారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన 29 ఏళ్ల మ‌హిళ‌కు తీవ్రంగా వాంతులు అవుతుండ‌టం, నీర‌సంగా ఉండ‌టంతో న‌వంబ‌ర్ 12న కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ప‌రీక్ష‌లు చేయ‌గా, ఆమె సిజేరియ‌న్ మచ్చ (గ‌తంలో ప్ర‌స‌వం స‌మ‌యంలో చేసిన‌ప్పుడు ఏర్ప‌డిన మ‌చ్చ‌) వ‌ద్ద ఒక గ‌డ్డ లాంటిది ఏర్ప‌డింది. మ‌హిళ‌కు గ‌ర్భం ఉండాల్సిన ప్ర‌దేశంలో కాకుండా వేరేచోట వ‌చ్చింద‌ని, దానివ‌ల్ల గ‌ర్భాశ‌యం చిరిగిపోయి చివ‌ర‌కు బాధితురాలు మ‌ర‌ణించే ప్ర‌మాదం కూడా ఉంద‌ని వైద్యులు గుర్తించారు. ఆమెకు అందించిన చికిత్స గురించి కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ జ్యోతి కంక‌ణాల మాట్లాడుతూ.. “ఇలాంటి ప‌రిస్థితులు చాలా అరుదు. గ‌తంలో సిజేరియ‌న్ శ‌స్త్రచికిత్స చేయించుకున్న‌వాళ్ల‌కే ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

ఈ ప‌రిస్థితి సంక్లిష్ట‌త దృష్ట్యా ప‌లు విభాగాల‌కు చెందిన వైద్యులు చికిత్స చేయాల్సి వ‌చ్చింది. ముందుగా గ‌ర్భాశ‌య ర‌క్త‌నాళాల‌కు సుమారు నాలుగు గంట‌ల పాటు ఎంబోలైజేష‌న్ చేశాం. 36 గంట‌ల త‌ర్వాత లాప్రోస్కొపీ ప‌ద్ధ‌తిలో గ‌ర్భాశ‌యాన్ని ఖాళీ చేసి, సాధార‌ణ ప‌రిస్థితికి తెచ్చాం” అని ఆమె వివ‌రించారు. ప్ర‌స్తుతం రోగి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆమెకు తిరిగి గ‌ర్భం దాల్చే అవ‌కాశం కూడా ఉంద‌ని వివ‌రించారు.



Next Story