ఓ వైపు భార్యభర్తల గొడవ.. తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన మైనర్‌ను లాక్కెళ్లి..

by  |
ఓ వైపు భార్యభర్తల గొడవ.. తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన మైనర్‌ను లాక్కెళ్లి..
X

దిశప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యం ఘటన మరువకముందే మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై 19ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేసి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ రణవీర్ రెడ్డి కథనం ప్రకారం..

హబీబ్‌ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు పిల్లలతో కలిసి ఉండే ఓ కుటుంబంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త తిడుతూ, కొడుతున్నాడని భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని పిలిపించి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో ఇంటి దగ్గర పిల్లలు ఒంటరిగా ఉన్నారు. తల్లి కనిపించడం లేదని ఆమెను వెతుక్కుంటూ 9 ఏళ్ల కూతురు ఇంటి నుండి బయటకు వచ్చింది.

మల్లేపల్లి సమీపంలోకి వచ్చిన బాలికను దూరపు బంధువు సుమిత్ (19) చేయి పట్టుకుని స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఏడవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. పీఎస్ నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురు కనిపించకపోవడంతో డయల్ 100కు కాల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూం సిబ్బంది మంగళ్‌హాట్, హబీబ్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సీసీ కెమెరాల ఆధారంగా బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక పేరెంట్స్‌కు అసలు విషయం చెప్పింది. దీంతో వారు మంగళ్‌హాట్ పోలీసులను ఆశ్రయించి సుమిత్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుమిత్ పై పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాలికను భరోసా సెంటర్‌కు పంపించి వైద్య పరీక్షలు చేయించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed