స్వర్ణకు.. మాకు సంబంధంలేదు: రమేష్ హాస్పిటల్

by  |
స్వర్ణకు.. మాకు సంబంధంలేదు: రమేష్ హాస్పిటల్
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని బందరు రోడ్డులోని స్వర్ణప్యాలెస్​ హోటల్​ నిర్వహణతో తమకు సంబంధం లేదని రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ మంది కరోనా రోగులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్​ హోటల్​ను కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

హోటల్​ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను మాత్రమే రమేష్ ఆస్పత్రి నిర్వహించినట్లు తెలిపింది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగుల కోసం కేటాయించామని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. దానిలో 30 పడకలే ఉండటంతో ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేకపోతున్నామన్నారు. కరోనా రోగులను చేర్చుకోవాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావటంతో అన్ని సౌకర్యాలున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్​లో ప్రభుత్వ అనుమతితోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. స్వర్ణ ప్యాలెస్​లో కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారన్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది.

Next Story

Most Viewed