దేవుడి సాక్షిగా.. రామతీర్థంలో రాజకీయ రగడ!

by  |
దేవుడి సాక్షిగా.. రామతీర్థంలో రాజకీయ రగడ!
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలోని హిందూ ఆలయంలో దేవుళ్లకు చెందిన విగ్రహాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. వాటికి తోడు అటు బీజేపీ, ఇటు టీడీపీ రామతీర్థం వద్ద టెంట్లు వేసుకుని మరి పోటాపోటీ నిరసనలు తెలుపుతున్నాయి. శనివారం రామతీర్థాన్ని సందర్శిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో అక్కడ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఆలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

బాబు పర్యటన నేపథ్యంలో అక్కడకు చేరుకుంటున్న టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ వైసీపీ ప్రభుత్వ పని తీరుపై మండిపడుతోంది. జగన్ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు తీవ్రతరమయ్యాయని బీజేపీ, టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రామతీర్థం వద్ద టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు తీవ్ర ఆందోళనలు చేస్తుండగా.. పరిస్థితిని సమీక్షించేందుకు అధికార పార్టీ నేత, రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి బయలుదేరారు.అదే విధంగా ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ శిబిరానికి ప్రదర్శనగా వెళ్లనున్నారు. మొత్తంగా రామతీర్థం వద్ద పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతోంది.



Next Story