ట్విట్టర్ vs కేంద్రం.. రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు

by  |
ట్విట్టర్ vs కేంద్రం.. రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వాలను కూల్చే శక్తి ఉన్నదని, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచి అరాచకానికి బాటలు వేసే అవకాశముందని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు. అందుకే రాజ్యాంగ పరిధిలోనే వీటిని నియంత్రించడానికి నిబంధనలు రూపొందించాల్సిన అవసరముందని సూచించారు. ప్రభుత్వమూ ఆ దిశగా చట్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతున్న తరుణంలో రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తన కొత్త పుస్తకం బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్‌ను విడుదల చేస్తూ ప్రజాస్వామ్యంపై ఒత్తిడి పెరుగుతున్నదని, రాజకీయేతర, ప్రభుత్వేతర శక్తుల వృద్ధితో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని అన్నారు. ఇవి ఎల్లలులేనివి కాబట్టి నియంత్రించడం కష్టతరమని, ప్రస్తుత చట్టాలు ఆ పనిచేయలేవని అభిప్రాయపడ్డారు. వీటిని ఎదుర్కోవడానికి కొత్త చట్టాలు అవసరముందని, ప్రభుత్వమూ ఆ దిశగా పని ప్రారంభించిందని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుతూ కొన్ని కుటుంబాలకే పరిమితమైన కశ్మీర్ రాజకీయాల్లోకి క్షేత్రస్థాయి నుంచి నేతలు ఎదుగుతున్నారని, కశ్మీరులంతా 130 కోట్ల మంది గల భారత కుటుంబంలో భాగమేనన్న నమ్మకాన్ని కల్పించడం కశ్మీరేతర భారతీయుల బాధ్యత అని అన్నారు.


Next Story