ట్రాక్టర్లతో ముట్టడిస్తాం.. టికాయత్ హెచ్చరిక

by  |
ట్రాక్టర్లతో ముట్టడిస్తాం.. టికాయత్ హెచ్చరిక
X

గాంధీనగర్: అవసరమైతే గుజరాత్ రాజధాని గాంధీనగర్‌నూ ట్రాక్టర్లతో ముట్టడిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికయత్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన దేశవ్యాప్తంగా రైతుల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టికయత్ మాట్లాడుతూ.. గాంధీనగర్‌ను రైతులు ట్రాక్టర్లతో ముట్టడించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అవసరమైతే బారీకేడ్లను బద్దలు కొట్టుకుని మరీ రాజధానిని ముట్టడిస్తామని అన్నారు. గుజరాత్‌లో రైతులకు వారి సమస్యలను చెప్పుకునే వాయిస్ లేకుండా చేశారని, వారికి కోర్టుల నుంచి కూడా మద్దతు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారనీ, ఆ కిటుకేదో తమకు చెబితే దేశంలోని మిగతా రైతులకూ చెప్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆలుగడ్డ రైతులు కిలోకు రూ. 3 చొప్పున వారి పంటలను అమ్ముకుంటున్నా ప్రభుత్వం మాత్రం వారు సంతోషంగా ఉన్నారని చెప్పడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పారిశ్రామికవేత్తలు నడుపుతున్నారని టికయత్ ఆరోపించారు.



Next Story

Most Viewed