ఆ ఇండ్లను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మాలని చూస్తోంది.. సీపీఎం

by  |
rajiv
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇండ్లను తగ్గింపు రేట్లకు దరఖాస్తుదారులకు ఇవ్వాలని సీపీఎం నగర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీపీఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ స్వగృహ ఇండ్లను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకునే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని, దీనిని వెంటనే విరమించుకోవాలన్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువగా ఇవ్వడానికి ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న వాగ్ధానాన్ని కూడా పక్కన పెట్టి వేలం వేసేందుకు పూనుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు . ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకుని ఉద్యోగులకు లేదా దరఖాస్తుదారులకు తగ్గింపు రేట్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హయాంలో రూ. 1747 కోట్లతో నిర్మించిన సుమారు 12 వేల ఇండ్లలో 10 వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో వీటిని పట్టించుకోకపోవడంతో అనేక ప్రాంతాలలో ఇండ్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఇండ్ల కోసం 76 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరలను నిర్ణయించడంతో వీటిని తీసుకోవడానికి మెజార్టీ ప్రజలు ముందుకు రావడం లేదని శ్రీనివాస్ అన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 1250 కోట్ల అప్పు చేసి వడ్డీ చెల్లించలేక బండ్లగూడ ప్రాంతంలో కొన్నింటిని బ్యాంకులకు కట్టబెట్టిందన్నారు. మిగిలిన ఇండ్లను వేలం వేయబోతోందని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకుని తక్కువ ధరలకు దరఖాస్తు దారులకు అప్పగించాలని కోరారు.

Next Story