రాజస్థాన్‌ను గెలిపించిన ఆ ఇద్దరు

by  |
రాజస్థాన్‌ను గెలిపించిన ఆ ఇద్దరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 147 పరుగులు మాత్రమే చేసింది. క్యాప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. లలిత్ యాదవ్ (20), క్రిస్‌ వోక్స్ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ కూడా 10 పరుగులు మించి చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 147 పరుగులతో సరిపెట్టుకుంది.

ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (2), మనన్ వోహ్రా (9), సంజూ శాంసన్ (4), శివం దూబే (2), రియాన్ పరాగ్ (2) పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. ఇటువంటి సమయంలో జట్టు భారాన్ని మీదేసుకున్న డేవిడ్ మిల్లర్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి తోడుగా రాహుల్ తివాతియా కాసేపు క్రీజులో సహకరించాడు. మొత్తం 43 బంతులు ఫేస్ చేసిన మిల్లర్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 62 పరుగులు తీశాడు. ఇదే క్రమంలో 16వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది.. మూడో బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు తివాతియా కూడా వికెట్ పారేసుకున్నాడు.

మోరిస్ అదుర్స్

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు క్రిస్ మోరీస్ అండగా నిలిచాడు. వరుస బౌండరీలు బాదుతూ జట్టును విజయం వైపు నడిపించాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికి రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో 4 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. ఇక మూడో బంతిని డిఫెన్స్ చేసిన మోరిస్.. నాలుగో బంతిని సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు. మొత్తం 18 బంతుల్లో 4 భారీ సిక్సర్లు కొట్టి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంక రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్‌‌ను గెలిపించాడు. దీంతో 19.4 ఓవర్లలో ఆర్‌ఆర్ 150 పరుగులు చేసి ఐపీఎల్‌ సీజన్‌ 14లో బోణీ కొట్టింది.


Next Story

Most Viewed