తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ

by  |
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
X

జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని ఎత్తులు వేస్తున్నది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు కారణంగా కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. అదే పరిస్థితి రాజస్థాన్‌లో పునరావృతం కాకుండా ఉండటం కోసం పలు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్న 19 ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత నిర్వహించిన రెండు సీఎల్పీ సమావేశాలకు గైర్హాజరు కావడంపై సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. తమకు నోటీసులు అందలేదని ఎవరూ తప్పించుకోకుండా ఉండటం కోసం వీలైనన్ని విధాలుగా పంపుతున్నది. ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్, తపాలా ద్వారా నోటీసులు అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేల ఇళ్లకు హిందీ, ఆంగ్లంలో ముద్రించిన నోటీసులను కూడా అంటించింది.

సీఎల్పీ సమావేశం గురించి పూర్తి సమాచారం ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా హాజరుకా లేదని కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ‘కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరు కావాలని మిమ్మల్ని కోరాం. కానీ, ఎలాంటి రాతపూర్వక ముందస్తు సమాచారం లేకుండా మీరు సమావేశానికి హాజరు కాలేదు. ఉద్దేశ పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు ఆధారాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి మీపై చర్యలు తీసుకోవడం కోసం నోటీసులు జారీ చేస్తున్నాం. రెండు రోజుల్లో సమాధానం చెప్పండి’అని నోటీసుల్లో కాంగ్రెస్ పార్టీ కోరింది.

గత ఆదివారం నుంచి సచిన్ పైలట్ దేశ రాజధానిలో తిష్ఠ వేశారు. ఆయన మద్దతుదారులైన దాదాపు 20మంది ఎమ్మెల్యేలు గురుగ్రాంలోని రిసార్ట్‌లో ఉన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ ఉద్దేశపూర్వకంగా తనను అవమానపర్చడమే కాకుండా చిన్నచూపు చూస్తున్నాడని సచిన్ పైలట్ ప్రధాన ఆరోపణ.

Next Story

Most Viewed