బీజేపీపై రాజస్తాన్ సీఎం ఆరోపణలు

by  |
బీజేపీపై రాజస్తాన్ సీఎం ఆరోపణలు
X

జైపూర్: ఒకవైపు కరోనా దేశాన్ని వణికిస్తుంటే మరోవైపు బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తున్నదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఒక్క ఎమ్మెల్యేకు రూ. 15 కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నదని, లేదా ఇతర ప్రయోజనాలు చేసి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకునే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెడుతున్న వార్తలు రోజూ వింటున్నామని తెలిపారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీజేపీ సహా అందరినీ కలుపుకుని పోతున్నదని, కానీ, కరోనా కష్టకాలంలోనూ ఆ పార్టీ సమస్యలు సృష్టిస్తున్నదని వివరించారు. గతేడాది కర్ణాటక, జూన్‌లో మధ్యప్రదేశ్‌లలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి సర్కారును బీజేపీ కూల్చేసిందని ప్రస్తావించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నిజస్వరూపం వెల్లడవుతూనే ఉన్నదని, అప్పట్లో చాటుమాటుగా చేసే తప్పుడు పనులను ఇప్పుడు బాహాటంగా చేస్తున్నదని ఆరోపణలు సంధించారు. గోవా, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ తీరును అందరూ చూశారని, రాజస్తాన్‌లోనూ అటువంటి కుట్రలే చేసిన బీజేపీకి చాలాకాలం గుర్తుండిపోయే గుణపాఠాన్ని నేర్పామని అన్నారు. బీజేపీ బడా నేతలు ఈ కుట్రలో భాగస్వాములయ్యారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే యత్నాలు జోరందుకున్నాయని అధికార పక్షం ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.



Next Story