మహారాష్ట్రలో వర్ష బీభత్సం

by  |
మహారాష్ట్రలో వర్ష బీభత్సం
X

ముంబయి: మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కొంకణ్ రీజియన్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాయిగడ్, రత్నగిరి, సతారా సహా గోండియా, చంద్రాపూర్, థానే, కొల్హాపూర్‌లలో అత్యధికవర్షాపాతం నమోదైంది. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం ఒక్క రోజే కనీసం 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రాయిగడ్ జిల్లాలోని మహద్ తాలూకా, తలియా గ్రామంలో విరిగిపడ్డ కొండచరియల కింద చిక్కుకుపోయి కనీసం 36 మంది మృతి చెందారు. సతారా జిల్లాలో ఆరుగురు వర్ష సంబంధ ఘటనల్లో మరణించారు. ఈ ఘటనల్లో దాదాపు 60 నుంచి 70 మంది కొండ చరియల కిందే చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. రత్నగిరిలో బురద కింద కనీసం 10 మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 50కిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

వర్ష సంబంధ ఘటనల్లో గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో 129 మంది మరణించి ఉంటారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం సాయంత్రం వెల్లడించడం గమనార్హం. మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాయిగడ్, రత్నగిరి, సిందుదుర్గ్, పూణె, సతారా, కొల్హపూర్‌లలో రెడ్ అలర్ట్ ఆదేశాలు అమలు చేయాలని సూచించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్ఎఫ్, స్థానిక రిలీఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. తీరప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారు ఇళ్లపై లేదా ఎత్తైన ప్రదేశాలు, కొండలపై నిలబడాలని, తద్వారా హెలికాప్టర్‌లలోని బృందాలు కనిపిస్తారని, రక్షించడం తేలికవుతుందని అధికారులు సూచనలు చేశారు.

గురువారం జరిగిన ఈ ఘటనపై సీఎం ఉద్ధవ్ ఉన్నతాధికారులతో సమీక్ష పెట్టారు. కొవిడ్, ఇతర ఆరోగ్య సమస్యల చికిత్సకు అంతరాయం వాటిల్లవద్దని స్పష్టం చేశారు. తీరప్రాంతంలోని చిప్లున్ పట్టణంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 24 గంటలపాటు కొట్టిన నిరంతరాయ వర్షానికి ఇల్లు వాకిలి ఏకమైనట్టయింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వశిష్ట నది పొంగిపొర్లుతున్నది. రోడ్లను, ఇళ్లను ముంచెత్తుతున్నది. కొవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్‌లోకీ నీళ్లు చేరడంతో పేషెంట్లను మరో చోటికి తరలించారు.

ప్రధాని సంతాపం

మృతులకు ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. రాయిగడ్‌లో కొండచరియలు విరిగిప మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని విపత్కరపరిస్థితులను పరిశీలిస్తున్నామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడి మృతిచెందినవారి కుటుంబీకులకు రూ. 5 లక్షల పరిహారాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.


Next Story

Most Viewed