భానుడి భగభగలకు వరుణుడి అడ్డుకట్ట

by  |
భానుడి భగభగలకు వరుణుడి అడ్డుకట్ట
X

దిశ, ఏపీ బ్యూరో: భానుడి భగభగలకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. గత 20 రోజులుగా ఏపీ వాసుల్ని వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపడం ఆరంభించేవాడు. మధ్యాహ్నానికి ఎండ తీవ్ర స్థాయిని దాటేసేది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసేవి. దీంతో ఎండ వేడిమికి తాళలేక ప్రజలు అల్లాడిపోయేవారు. గత మూడు రోజులకు ఇది మరింత తీవ్ర స్థాయికి చేరింది. అలాంటిది నిన్న సాయంత్రానికి వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. దట్టంగా మేఘాలు అలముకున్నాయి. మేఘాలు నీలివర్ణానికి చేరేసరికి వేగంగా గాలివీయడం ఆరంభించింది. వర్షం పడుతుందేమోనని అంచనావేసేలోగా భారీ వర్షాలు ఉత్తరాంధ్ర వాసులను పలకరించాయి. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు, గీతనాపల్లిలో ఇద్దరు, శ్రీహరిపురంలో ఒక్కరు, వంతరాంలో ఇద్దరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం వెంకంపేటలో పిడుగు పడి ఏడు గొర్రెలు మృతి చెందాయి. రాజాం మండలం పెనుబాక గ్రామంలో విద్యుత్ వైర్ తెగి పడి రెండు గేదెలు మృతి చెందాయి. ఈదురు గాలులు, అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మామిడి పంట నేలరాలింది. మిగిలిన పంటకు మచ్చ వచ్చే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎండ నుంచి ఉపశమనం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed