ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్టుకు రైల్వే, ఎయిర్‌ఫోర్స్

by  |
ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్టుకు రైల్వే, ఎయిర్‌ఫోర్స్
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆక్సిజన్ సరఫరా సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే, భారత వాయుదళాన్ని రంగంలోకి దింపినట్టు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్లను ఏ రాష్ట్రమూ అడ్డుకోవద్దని, అంతరాయాలు కల్పించవద్దని రాష్ట్రాల సీఎంలకు చెప్పారు. ఆక్సిజన్ ట్యాంకర్ గమ్యస్థానం ఏదైనా అది సజావుగా ప్రయాణించడానికి దోహదపడాలని అన్నారు. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ శుక్రవారం వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఒక రాష్ట్ర మెడికల్ అవసరాలను మరొక రాష్ట్రం తీర్చుకుంటూ ఐక్యంగా, సమన్వయంగా కరోనాపై విజయవంతంగా పోరు చేయాలని పీఎం అన్నారు. రాష్ట్రాలన్నీ ఒకదేశంగా కలిసి పనిచేస్తే వనరుల కొరతే ఉండదని వివరించారు.

ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలురాష్ట్రాల్లో హాస్పిటళ్లు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో ప్రధాని తాజా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరాలు, ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కలిసి పనిచేస్తున్నాయని, పారిశ్రామిక ఆక్సిజన్‌ను హాస్పిటళ్లకు మళ్లించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకోవద్దని, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ మొత్తాన్ని రాష్ట్రంలో అవసరమున్న హాస్పిటళ్లకు ప్రభావవంతంగా కేటాయించి సరఫరా చేయడానికి ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరా సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నదని తెలిపారు. రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించాయని, ఖాళీ ట్యాంకర్‌లను వేగంగా తిరిగి తీసుకెళ్లడానికి ఎయిర్ ఫోర్స్‌ను రంగంలోకి దించినట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త టీకా పంపిణీ విధానం వివక్షాపూరితంగా ఉన్నదన్న వాదనలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 15 కోట్ల టీకా డోసులను ఉచితంగా రాష్ట్రాలకు అందజేసిందని ప్రధాని వివరించారు. టీకా పంపిణీని వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. హాస్పిటళ్లలో ప్రమాదాలు దురదృష్టకరమని, హాస్పిటళ్ల సేఫ్టీ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు



Next Story