కొవిడ్ వార్డులుగా రైలు బోగీలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

by  |
కొవిడ్ వార్డులుగా రైలు బోగీలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఖాళీగా ఉన్న రైలు బోగీలను కొవిడ్ వార్డులుగా మార్చడాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్ల అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కొన్ని రైలు కోచ్‌లు కొవిడ్ పాజిటివ్ పేషెంట్ల కోసం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో దేశం మొత్తం మీద 4002 కోచ్‌లు కొవిడ్ పేషెంట్ల కోసం తాత్కాలిక ఆసుపత్రులగా రెడీ అయ్యాయి. స్టేషన్లలో ఆగి ఉన్న ఈ రైళ్ళలో కొవిడ్ పేషెంట్లను అడ్మిట్ చేసుకుని రైల్వే డాక్టర్లతో సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిమంది డాక్టర్లను కేటాయించే పని మొదలైంది. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్‌లు తదితరాలను కూడా సమకూరుస్తున్నారు. రైల్వే శాఖ గతేడాది కూడా ఇలాంటి ప్రయత్నాన్ని చేపట్టినా పూర్తి స్థాయిలో ఇలాంటి కోచ్‌లను వాడుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ చర్యలను సమర్ధిస్తూనే ఈ గతి పట్టడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనమేనంటూ విమర్శలు కూడా ఘాటుగానే వినిపిస్తున్నాయి. ప్రపంచ రికార్డులను సృష్టించే తీరులో అతి ఎత్తయిన పటేల్ విగ్రహం, విశాలమైన స్టేడియం, నూతన హంగులతో కూడిన పార్లమెంటు నిర్మాణం లాంటివాటిపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఉన్న శ్రద్ధ ప్రజల కనీస అవసరమైన ప్రజారోగ్యం, ఆసుపత్రుల నిర్మాణం తదితరాలపై ఎందుకు లేదని ట్విట్టర్ వేదికగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పీయూష్ గోయల్‌పై ఫైర్ అవుతున్నారు. ప్రయాణీకులను తీసుకెళ్ళాల్సిన రైలు కోచ్‌లను కొవిడ్ వార్డులుగా మారుస్తున్నందుకు సంతోషించాలా లేక ప్రజల అవసరాలకు తగినంతగా ఆసుపత్రులు పెట్టలేకపోయిన ప్రభుత్వ చేతకానితనాన్ని చూసి బాధ పడాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.



Next Story