ఛైర్మన్ బాధ్యతలకు రాహుల్ బజాజ్ వీడ్కోలు!

by  |
ఛైర్మన్ బాధ్యతలకు రాహుల్ బజాజ్ వీడ్కోలు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో కరోనా సంక్షోభం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభాలను పక్కనబెడితే, ఈ ఏడాది దేశీయంగా వ్యాపార రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో పలు మార్పులు జరిగాయి. ఇటీవల దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ ఛైర్మన్‌గా శివ్‌నాడార్ పదవి నుంచి దిగిపోగా, తాజాగా దేశీయ మరో కార్పొరేట్ దిగ్గజ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. జులై 31 నాటికి రాహుల్ బజాజ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా పూర్తవనుంది. అయితే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఆ సంస్థ తెలిపింది. ఆయన స్థానంలో కుమారుడు, ప్రస్తుతం వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న సంజీవ్‌ బజాజ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతారని స్పష్టంచేసింది. అయితే, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంజీవ్‌ 2013 నుంచే ఛైర్మన్‌గా కొనసాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

కంపెనీ నేపథ్యం…

బజాజ్ ఫైనాన్స్ సంస్థను 1987లో స్థాపించారు. అప్పటినుంచే రాహుల్ బజాజ్ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. రాహుల్ బజాజ్ అత్యుత్తమ నిర్ణయాలతోనే సంస్థ ఈ స్థాయికి చేరుకుందని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. ఈ నెలతో రాహుల్ పదవీ బాధ్యతలు పూర్తవుతాయని, అనంతరం ఆగష్టు 1నుంచి సంస్థ ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ బాధ్యతలు తీసుకుంటారని బోర్డు డైరెక్టర్లు వివరించారు. ఈ నేపథ్యంలో సంజీవ్ బజాజ్‌ను ఛైర్మన్‌గా నియమించేందుకు డైరెక్టర్లు అవసరమైన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)గా ప్రాచుర్యం పొందిన బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ అనుబంధంగా ఈ సంస్థ కొనసాగుతోంది. ప్రైవేట్ రుణాలు, బీమా రంగాల్లో సంస్థకు తిరుగులేని పేరుంది. ఇప్పటివరకు కంపెనీలో మొత్తం 20,154 ఉద్యోగులున్నారు. దేశవ్యాప్తంగా 1400 పైగా నగరాల్లో కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వృద్ధాప్యం, ఇతర కారణాలతో రాహుల్ బజాజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటారనే వార్త కార్పొరేట్ వర్గాల్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా, రాహుల్‌ బజాజ్‌ చైర్మన్‌ పదవి నుంచి దిగిపోతున్నారని తెలియడంతో ఆ కంపెనీ షేర్ల ధర ఒక్కసారిగా 6.43 శాతం తగ్గిపోయింది.

బజాజ్ ఫైనాన్స్ తొలి త్రైమాసిక లాభం రూ. 962 కోట్లు…

కరోనా సంక్షోభం నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 19 శాతం తగ్గి రూ. 962 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,195 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. కొవిడ్-19 సంక్షోభం కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపించిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇక, బజాజ్ ఫైనాన్స్ నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 3,694 కోట్లని తెలిపింది. అంతేకాకుండా కార్యకలాపాల ఆదాయం 15 శాతం ఎగిసి రూ. 6,648 కోలుగా నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో కొవిడ్-19 కోసం కంపెనీ రూ. 1,450 కోట్లను కేటాయింపులు చేసిందని, కొవిడ్ కోసం మొత్తం జూన్ చివరి నాటికి రూ. 2,350 కోట్లను కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏకీకృత ప్రాతిపదికన జూన్ 30 నాటికి కంపెనీ ద్రవ్యమిగులు రూ. 17,700 కోట్లని, ఇది జులై 20 నాటికి రూ. 20,590 కోట్లని కంపెనీ తెలిపింది. స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 1.40 శాతం, నికర ఎన్‌పీఏలు 0.50 శాతంగా ఉన్నాయని ప్రకటించింది.

Next Story