ముమ్మాటికీ ఇది పోలీసులు చేసిన హత్యే: ఆర్ఆర్ఆర్

by  |
ముమ్మాటికీ ఇది పోలీసులు చేసిన హత్యే: ఆర్ఆర్ఆర్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రపద్రేశ్‌ను విమర్శించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వదులు కోవడం లేదు. నిన్న నిమ్మగడ్డ కేసులో ఓటమి తరువాత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కిశోర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు. నలంద కిశోర్ కరోనాతో చనిపోయారని తెలుస్తోందన్న ఆయన, ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలని స్పష్టం చేశారు.

కిశోర్ ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటికీ ఆయనను విశాఖపట్నం నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన పోస్టుల్లో ఎవరి పేరూ లేదని చెప్పారు. అయినప్పటికీ ఆయనను అరెస్టు చేసి వేధించారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే..దానిని ఒక వైఎస్సార్సీపీ నేత పొలిటికల్ పంచ్ అన్నారని గుర్తు చేసిన ఆయన, ఆయనను అరెస్టు చేస్తే గగ్గోలు పెట్టామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే కాబట్టి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలు ..ఇప్పుడలా జరుగుతుండడం పట్ల ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మను కూడా వేధించారని చెప్పారు. ఇది సరికాదని ఆయన హితవు పలికారు.


Next Story