ఆర్థిక వృద్ధిపై కరోనా.. రాజన్ చిట్కా!

by  |
ఆర్థిక వృద్ధిపై కరోనా.. రాజన్ చిట్కా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకోవడమొకటే ఇప్పుడు అంతర్జాతీయ దేశాల కర్తవ్యమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. 46 దేశాలకు పాకిన కరోనా వైరస్‌పై స్పందించిన ఆయన దీన్ని అడ్డుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని, ఆర్థిక ఉద్దీపనల గురించి ఆలోచించకుండా వ్యాపిస్తున్న కరోనాను అరికట్టడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సి ఉందని అప్పుడు మాత్రమే దీన్ని నిలువరించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. కరోనాను అరికట్టేందుకు అత్యుత్తమైన టానిక్ ఆర్థిక ఔషధం అని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.

అన్ని రంగాల్లోని కంపెనీలకు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయనే ధైర్యాన్ని ఇవ్వాలని, సంస్థలకు మేలు కలిగించే ప్రధాన్యతలను ప్రభుత్వాలు కల్పించాలని తెలిపారు. కంపెనీల విషయంలో బ్యాంకుల కంటే ప్రభుత్వాలే ముందుగా స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని రఘురాజన్ చెప్పారు. ప్రధానంగా ప్రజల దృష్టి కరోనాను నిరోధించే చర్యలపై ఉందని, ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాయోననే ఆశలతో ప్రజలున్నారని రాజన్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల భయాలు, కంపెనీల ఆందోళన దశాబ్దం క్రితం అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేస్తోందన్నారు.

అంతర్జాతీయంగా ఉత్పత్తి ఘోరంగా దెబ్బ తిన్నదని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ముడి సరుకుల లోటును ఎదుర్కొంటున్నాయని రాజన్ ప్రస్తావించారు. అలాగే, కేవలం వారం రోజుల్లో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాలను లోనయ్యాయని చెప్పారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతం ఉండోచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 2009 సంవత్సరం కంటే బలహీనమైనదని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

Next Story

Most Viewed